సొమ్మొకరిది.. సోకొకరిది
ఆన్లైన్లో ఎంపిక చేసిన కలర్ ఇవ్వకుండా తిరకాసు ఎక్కువ మందికి పసుపు రంగు సైకిళ్ల పంపిణీ లబ్ధిదారుల ఆవేదన
పాలసముద్రం : ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో బ్యాటరీ సైకిళ్ల పంపిణీ గిన్నిస్ రికార్డు అయిందని గొప్పగా చెప్పుకుంటున్నారు. తీరా చూస్తే బ్యాటరీ సైకిళ్లు తెలుగుదేశం పసుపు కలర్లో పంపిణీ చేస్తున్నారు. సొమ్ము ఒకరిది.. సోకు టీడీపీదా అంటున్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఐకేపీ ద్వారా సంఘం సభ్యులకు పంపిణీ చేసిన బ్యాటరీ సైకిళ్ల పంపిణీలో లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. బ్యాటరీ సైకిళ్లు తీసుకోవడానికి ముందుకు రాలేదు. డబ్బులు ఏ శాఖలో రొటేసన్ అవుతాయో గుర్తించి చివరికీ ఐకేపీ సిబ్బందికి మండలానికి టార్గెట్ ఇచ్చారు. ఐకేపీ సిబ్బంది రూ. 24 వేల బ్యాటరీ సైకిల్ తీసుకోవాలని సంఘ సభ్యులకు తెలిపారు. వారు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో బ్యాటరీ సైకిల్ తీసుకోవడానికి వీఓలో రూ. 24 వేలు అప్పుగా ఇస్తామని, నెల నెలా కంతుల ప్రకారం వడ్డీతో చెల్లించాలని సీసీలు సంఘ మిత్రాలు తెలిపారు. అందుకు సంఘాల సభ్యులు మొదట బ్యాటరీ సైకిళ్లు ఇవ్వండి ఆపై ప్రతి నెలా రూ. 1000 వడ్డీతో సహా 24 కంతులు పట్టుకుంటామని తెలిపారు. అలా కాదు రూ 24 వేలు పూర్తిగా చెల్లిస్తేనే బ్యాటరీ సైకిళ్లు ఇస్తామని తెలిపారు. వారి టార్గెట్ పూర్తి చేయాలని ఉద్దేశంతో డ్వాక్రా సంఘాల సభ్యులకు నచ్చజెప్పి వీఓలో రూ.24 వేలు వారిపై అప్పురాసి ఆన్లైన్లో మీకు బ్యాటరీ సైకిల్ ఏ కలర్ కావాలని ఎంపిక చేసి సైకిళ్లు నమోదు చేసుకున్నారు. తీరా చూస్తే ఆన్లైన్లో నమోదు చేసిన కలర్ సైకిల్ ఇవ్వకుండా పసుపు కలర్ బ్యాటరీ సైకిళ్లు ఇస్తున్నారు. ఆన్లైన్లో నమోదు చేసిన కలర్ ఇవ్వకుండా మాకు పసుపు కలర్ ఇస్తున్నారని ఐకేపీ సిబ్బంది అడిగితే వారు సమాధానం చెప్పడం లేదు. నియోజకవర్గంలో సుమారు ఆరు వందలకుపైగా బ్యాటరీ సైకిళ్లు పంపిణీ చేశారు. ఇస్తున్నప్పుడే లైట్లు పడకుండా, బ్రేకులు పట్టకుండా పోతున్నాయి. రూ 24 వేలు ఇచ్చి బ్యాటరీ సైకిళ్లు తీసుకుని అది రిపేర్కు ఎక్కడ చేయించాలో తెలియని పరిస్థితిలో సైకిళ్లు తీసుకున్న లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.
సొమ్మొకరిది.. సోకొకరిది


