యూరియా కోసం తమ్ముళ్ల రగడ
సాక్షి టాస్క్పోర్సు : మండలంలోని జొన్నగురకలో యూరియా కోసం టీడీపీ నాయకుల మధ్య గొడవ చోటుచేసుకుంది. జొన్నగురకల సచివాలయం పరిధిలో ఎగువ తడకర, జొన్నగురకల పంచాయతీలు ఉన్నాయి. జొన్నగురకల రైతు సేవా కేంద్రంలో మంగళవారం వ్యవసాయాధికారులు యూరియా పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో రెండు గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు పరస్పరం ఒకరిపై ఒకరు తీవ్రమైన పదజాలంతో దూషించుకున్నారు. అక్కడ ఉన్న రైతులందరూ టీడీపీ నాయకుల తీరును చూసి ఛీదరించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో యూరియా కొరత ఉండగా టీడీపీ నాయకులు హంగామా అదికమవుతోందని రైతులు విమర్శిస్తున్నారు. రైతులకు పంపిణీ చేయడంలో సహకరించాల్సిన నాయకులు తమకు అనుకూలమైన వారికి యూరియా ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. కూటమి నాయకుల ఆగడాలకు అధికారులకు తలనొప్పిగా మారుతోంది. పంటలు సాగు చేసే రైతులు చాలా మందికి యూరియా అందడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ప్రతి రైతు సేవా కేంద్రంలో యూరియా పంపిణీలో అధికార పార్టీ నేతలు వారికి అనుకూలమైన వారికే ఇవ్వాలని ఒత్తిళ్లు తెస్తున్నట్లు రైతుల నుంచి విమర్శలున్నాయి. దీంతో సామాన్య రైతులు వేకువజాము నుంచే పడిగాపులు పడినా ఎరువులు అందక నిరుత్సాహంతో వెనుతిరుగుతున్నారు.


