మార్కెట్‌ బౌన్స్‌బ్యాక్‌

Stock Market Highlights: Sensex Ends 563 Pts Higher, Nifty 50 Reclaims 18050 - Sakshi

సెన్సెక్స్‌ 563 పాయింట్లు అప్‌ 

నిఫ్టీ 158 పాయింట్లు జూమ్‌

60,656– 18,053 వద్ద ముగింపు

ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్, రియల్టీ ప్లస్‌

ముంబై: ముందురోజు నష్టాల నుంచి దేశీ స్టాక్‌ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. సెన్సెక్స్‌ 563 పాయింట్లు జంప్‌చేసి 60,656 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 158 పాయింట్లు ఎగసి 18,053 వద్ద ముగిసింది. ప్రధానంగా ఇండెక్స్‌ హెవీవెయిట్స్‌కు డిమాండ్‌ పెరగడంతో మార్కెట్లు ప్రస్తావించదగ్గ స్థాయిలో లాభపడ్డాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూలతలు సైతం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఐటీ, బ్యాంకింగ్‌ సంస్థలు పటిష్ట ఫలితాలు సాధిస్తుండటంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించినట్లు విశ్లేషించారు. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 60,704– 60,072 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ఈ బాటలో నిఫ్టీ 18,072–17,887 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు చవిచూసింది.

పీఎస్‌యూ బ్యాంక్స్‌ డీలా 
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ, ఆయిల్, ఐటీ, ఆటో రంగాలు 1.2–0.6 శాతం మధ్య పుంజుకున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు దాదాపు 2 శాతం పతనమయ్యాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎల్‌అండ్‌టీ, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, హెచ్‌సీఎల్‌ టెక్, టీసీఎస్, ఆర్‌ఐఎల్, బ్రిటానియా, అల్ట్రాటెక్, మారుతీ 3.7–1.2 శాతం మధ్య ఎగశాయి. అయితే ఎస్‌బీఐ, బజాజ్‌ ఫిన్, ఇండస్‌ఇండ్, విప్రో, టాటా స్టీల్, బజాజ్‌ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యూ 1.6–0.4 శాతం మధ్య నీరసించాయి.  

రూపాయి వీక్‌ 
డాలరుతో మారకంలో రూపాయి 12 పైసలు క్షీణించింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో 81.70 వద్ద ముగిసింది. సోమవారం ముగింపు 81.58కాగా.. మంగళవారం(17న) ట్రేడింగ్‌లో 81.79 వద్ద ప్రారంభమైంది. తదుపరి 81.89 వరకూ నీరసించింది. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 0.2 శాతం పుంజుకుని 102.4కు బలపడటం దేశీ కరెన్సీని దెబ్బ తీసినట్లు ఫారెక్స్‌ వర్గాలు తెలియజేశాయి. కాగా.. మంగళవారం ట్రేడింగ్‌లో చిన్న షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. బీఎస్‌ఈలో ట్రేడైన షేర్లలో 1,890 నష్టపోగా, 1,621 లాభపడ్డాయి. గత రెండు రోజుల్లో రూ. 3,173 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన ఎఫ్‌పీఐలు తాజాగా రూ. 211 కోట్లు ఇన్వెస్ట్‌ చేయడం గమనార్హం!

స్టాక్‌ హైలైట్స్‌ 
∙హైదరాబాద్‌లో వాణిజ్య నిర్మాణాలకుగాను రూ. 1,000–2,500 కోట్ల విలువైన ఆర్డర్‌ లభించినట్లు వెల్లడించడంతో ఎల్‌అండ్‌టీ కౌంటర్‌ 4 శాతం జంప్‌చేసింది. రూ. 2217 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 2,218 వద్ద సరికొత్త గరిష్టాన్ని చేరింది.  నేడు(18న) వాటాదారుల అత్యవసర సమావేశం(ఈజీఎం) నిర్వహించనున్న నేపథ్యంలో స్పెషాలిటీ రెస్టారెంట్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 9 శాతంపైగా జంప్‌చేసింది. రూ. 273 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సరికొత్త గరిష్టం రూ. 283 వరకూ దూసుకెళ్లింది.

చదవండి: Rage Applying: కంపెనీలను కుదిపేస్తున్న'రేజ్‌ అప్లయింగ్‌' సునామీ

       

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top