భారత్‌కు మారిన ఫోన్‌పే ప్రధాన కార్యాలయం

PhonePe shifts headquarters from Singapore to India - Sakshi

న్యూఢిల్లీ: త్వరలో పబ్లిక్‌ ఇష్యూకి (ఐపీవో) రానున్న నేపథ్యంలో ఫిన్‌టెక్‌ సంస్థ ఫోన్‌పే తమ కార్యాలయ చిరునామాను సింగపూర్‌ నుంచి భారత్‌కు మార్చుకుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తయినట్లు సంస్థ తెలిపింది. గత ఏడాది కాలంగా ఫోన్‌పే సింగపూర్‌కు చెందిన ఇన్సూరెన్స్‌ బ్రోకింగ్‌ సర్వీసులు, వెల్త్‌ బ్రోకింగ్‌ మొదలైన వ్యాపారాలు, అనుబంధ సంస్థలు అన్నింటిని ఫోన్‌పే ప్రైవేట్‌ లిమిటెడ్‌–ఇండియాకు బదలాయించినట్లు వివరించింది.

మరోవైపు, 3,000 మంది ఉద్యోగులకు ఫోన్‌పే ఇండియా కొత్త ప్లాన్‌ కింద కొత్త ఎసాప్‌ (ఎంప్లాయీస్‌ స్టాక్‌ ఆప్షన్స్‌)లను జారీ చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్‌ మాజీ ఎగ్జిక్యూటివ్‌లు సమీర్‌ నిగమ్, రాహుల్‌ చారి, బుర్జిన్‌ ఇంజినీర్‌ కలిసి ఫోన్‌పేను ప్రారంభించారు. దీన్ని ఫ్లిప్‌కార్ట్‌ 2016లో కొనుగోలు చేసింది. అటుపైన 2018లో ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికన్‌ రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ కొనుగోలు చేయడంతో ఫోన్‌పే కూడా వాల్‌మార్ట్‌లో భాగంగా మారింది. ప్రస్తుతం 8–10 బిలియన్‌ డాలర్ల వేల్యుయేషన్‌తో పబ్లిక్‌ ఇష్యూకి వచ్చే యోచనలో ఉంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top