దీపం వెలిగిస్తుండగా నిప్పంటుకుని గాయాలు
మదనపల్లె టౌన్ : శివరాత్రి పండుగ సందర్భంగా ఆలయంలో దీపం వెలిగిస్తున్న, ఓ వృద్ధ మహిళ చీరకు నిప్పంటుకుని తీవ్రంగా గాయపడింది. సోమవారం నిమ్మనపల్లె మండలంలో జరిగిన ఘటనపై బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మండలంలోని గారబురుకు చెందిన గంగులమ్మ(74) ఊర్లో ఉన్న శివాలయంలో గ్రామస్తులు విశారాధన చేస్తుండగా వెళ్లింది. అక్కడి ఆలయంలో సాయంత్రం ఓ దీపం ఆరిపోవడంతో తిరిగి వెలిగించే క్రమంలో చీరకొంగుకు నిప్పంటుకుని తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని కుటుంబీకులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చి వైద్యం అందించారు. ప్రథమ చికిత్స అనంతరం ఆమెను మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తీసుకెళ్లాని డాక్టర్లు సలహా ఇచ్చారు. నిమ్మనపల్లె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో భవన కార్మికులకు తీవ్ర గాయాలు
మదనపల్లె టౌన్ : రోడ్డు ప్రమాదంలో భవన కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం కురబలకోట మండలంలో జరిగింది. ప్రమాదానికి సంబంధించి ముదివేడు ఎస్ఐ మధురామ చంద్రుడు తెలిపిన వివరాలు.. పెద్దతిప్పసముద్రంకు చెందిన భవన కార్మికులు కరీముల్లా(22), అక్బర్(18), సౌకత్(22) భవన కార్మికులుగా పనిచేస్తున్నారు. ముగ్గురు రోజూ మాదిగిగానే మదనపల్లెలో భవన నిర్మాణం పనులు చేయడానికి బైకులో బయలుదేరారు. స్కూటర్ కురబలకోట మండలం, చెన్నామర్రి మిట్ట వద్దకు రాగానే ఓ కారు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని 108 సిబ్బంది మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సల అనంతరం కరీముల్లాను మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు వెళ్లాలని సూచించారు. కేసు దర్యాప్తులో ఉందని ఎస్ఐ తెలిపారు.
హ్యాండ్ లూమ్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం
మదనపల్లె టౌన్ : పట్టణంలో సోమవారం రాత్రి జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం వాటిళ్లింది. ఘటనపై అగ్ని మాపక అధికారి శివప్ప మీడియాకు తెలిపిన వివరాల మేరకు.. నీరుగుట్టువారిపల్లెలో నివాసం ఉంటున్న రవీంద్రారెడ్డి అమృత ట్రేడర్స్ పేరుతో హ్యాండ్ లూమ్, పవర్ లూమ్, స్ప్రేర్ పార్ట్స్ దుకాణం నడుపుతున్నాడు. ఈ క్రమంలో మహాశివరాత్రి సందర్భంగా సోమవారం కుటుంబీకులు దుకాణంలో సాయంత్రం దేవుడికి దీపాలు వెలిగించారు. అనంతరం వారు ఇంటికి వెళ్లిపోయారు. కొంతసేపటికే దీపాలకు హ్యాండ్ లూమ్ దారాలు అంటుకుని మంటలు చెలరేగి అంగడిలో ఉన్న సుమారు రూ.ఐదుల క్షలకు పైగా విలువైన మగ్గాల పరికరాలు కాలిపోయాయి. సమాచారం అందిన వెంటనే సిబ్బందితో వెళ్లి మంటలు అదుపుచేసి పక్కన ఉండే దుకాణాలకు మంటలు వ్యాప్తి చెంకుండా కంట్రోల్ చేశామని తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రూ.5 లక్షలకు పైగా ఆస్థి నష్టం


