కుమార్తెను కొట్టారని ఫిర్యాదు
రాయచోటి టౌన్ : రెండో తరగతి విద్యార్థి నోట్ బుక్లో పదం (స్పెలింగ్) తప్పుగా రాసిందని శ్రీచైతన్య స్కూల్ (4 బ్రాంచ్) టీచర్ విశ్వదీప వాతలు వచ్చేలా కొట్టిందని సంబేపల్లె మండలం పెద్ద పుత్త సబియా అనే మహిళ రాయచోటి అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపుత్త నబియా కుమార్తె పెద్ద పుత్త సమీహా (7) రాయచోటి పట్టణంలోని మదనపల్లె రోడ్డులో ఉండే శ్రీచైతన్య స్కూల్లో 2వ తరగతి చదువుతోంది. బుధవారం పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చింది. నీరసంగా ఉన్నట్లు గమనించి ఏమైందని తల్లి ప్రశ్నించగా టీచర్ కొట్టిందని చెప్పింది. దీంతో తల్లి చూడా ఒళ్లంతా వాతలు కనిపించాయని ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదుపై పోలీసులు స్పందించి సంబంధిత టీచర్పైనే కాకుండా యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రౌడీషీటర్ హత్య కేసులో
మదనపల్లెలోనూ మూలాలు
మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా పుంగనూరుకు చెందిన రౌడీషీటర్ డీజే భాస్కర్ కర్ణాటక నంగిలి పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యకు గురి కావడం తెలిసిందే. ఈ కేసులో మూలాలు మదనపల్లెలో ఉన్నట్లు బయటపడింది. భాస్కర్ తలలేని మొండెం ఆంధ్ర సరిహద్దులోనూ.. తల కర్ణాటక లోనూ.. ఉండటంతో కేసు నమోదు చేసిన కర్ణాటక నంగిలి పోలీసులు, ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్నారు.సీఐ, ఎస్ఐల బృందం విభిన్న కోణాల్లో లోతుగా దర్యాప్తు సాగించారు. ఈ నేపథ్యంలో సెల్ ఫోన్ ద్వారా కొన్ని ఆధారాలను సేకరించారు. మదనపల్లె పట్టణం, బెంగుళూరు రోడ్డులోని ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్న యువతిని అనుమానంతో బుధవారం సాయంత్రం పట్టుకెళ్లారు. దీంతో మదనపల్లెలోనూ పుంగనూరు రౌడీషీటర్ డీజే భాస్కర్ హత్య కేసుకు మూలాలు ఉన్నట్లు బయటపడింది. హంతకులు మదనపల్లె కు చెందిన వారు కూడా ఉన్నట్లు అక్కడి పోలీసులు అనుమానం వ్యక్తం చేయడం చర్చినీయాంశంగా మారింది.
కమలాపురం : కమలాపురం పట్టణ పరిధిలోని అప్పాయపల్లె గ్రామానికి చెందిన మార్పురి సుధీకర్ను 2017లో హత్య చేసిన నిందితలకు గౌరీగాలే ఈశ్వరమ్మ, షిండే చంద్ర అలియాస్ చందు, సయ్యద్ ముబారక్ అలియాస్ పండులకు కడప 4వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి జి.దీనబాబు జీవిత ఖైదుతో పాటు రూ. 5వేలు జరిమానా విధించారు. కేసుకు సంబంధించిన పూర్వ పరాలు పరిశీలిస్తే 2017లో వివాహేతర సంబంధం, ఇతర కుటుంబ కలహాల నేపథ్యంలో మార్పురి సుధీకర్ను నిందితులు పెద్దచెప్పలికి చెందిన గౌరీగాళ్ల ఈశ్వరమ్మ, కమలాపురానికి చెందిన షిండే చంద్ర అలియాస్ చందు, అప్పాయపల్లె కు చెందిన సయ్యద్ ముబారక్ అలియాస్ పండు కలసి పథకం ప్రకారం కత్తితో పొడిచి, కర్రలతో దాడి చేసి హత్య చేశారు. ఈ సంఘటనపై అప్పట్లో కమలాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి ఆధారాలతో కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ ప్రవేశ పెట్టిన సాక్ష్యాలను, దర్యాప్తు అధికారుల నివేదికలను నిశితంగా పరిశీలించిన న్యాయమూర్తి జి.దీనబాబు నిందితులపై మోపిన హత్యా నేరం రుజువైనట్లు నిర్ధారించారు. దీంతో ముగ్గురు నిందితులకు జీవిత కాల కఠిన కారాగాన శిక్షతో పాటు రూ.5వేలు జరిమాన విధిస్తూ తీర్పు వెలువరించారు. కాగా ఈ కేసులో నిందితులకు శిక్ష పడేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలాజీ సమర్థవంతంగా వాదనలు వినిపించారు. ఈ కేసులో సాక్షులను సకాలంలో హాజరుపెట్టిన కమలాపురం ఎస్ఐ విద్యా సాగర్ను వీరికి సహకరించిన కోర్టు మానిటరింగ్ పోలీస్ సిబ్బంది సుబ్బరాయుడు, వెంకటేశ్వర్ రెడ్డి, నరసింహ రాయుడులను జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ప్రత్యేకంగా అభినందించారు.
ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్
కడప అర్బన్ : కడప తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం చౌటపల్లి రైల్వే గేట్ సమీపంలో షేక్ దర్బార్ వల్లి అనే దొంగను రెడ్డెప్ప ఆధ్వర్యంలో ఎస్ఐ మోహన్ కుమార్ గౌడ్ తమ సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనానికి పాల్పడిన 10 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ మోహన్ కుమార్ గౌడ్ వివరాలను తెలియజేశారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి, వరుస మోటర్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని అరెస్ట్ చేసామన్నారు. సత్యసాయి జిల్లా గౌకనపల్లి చెందిన షేక్ దర్బార్ వల్లి (42) గతంలో సెల్ఫోన్ దొంగతనాల కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు.


