కాళేశ్వరం కాల్వల పనులకు టెండర్లు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ దిగువన పూర్వ మెదక్ జిల్లా, రంగారెడ్డి జిల్లాలో కాల్వల నిర్మాణ పనులకు నీటి పారుదల శాఖ టెండర్లు పిలిచింది. మొత్తం రూ.1,094.56 కోట్ల పనులను మూడు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు ఆహ్వానించింది. సంగారెడ్డి కాల్వలను కొండపోచమ్మ దిగువన వర్గల్ మండలం గౌరారం నుంచి మనోహరాబాద్ మండలం జీడిపల్లి గ్రామం వరకు 37 కి.మీ కాల్వను తొలి రీచ్గా విభజించారు. దీనికి రూ.365.54 కోట్లకు టెండర్ పిలిచారు.
జీడిపల్లి నుంచి నర్సాపూర్ మండల పరిధిలోని చిప్పలపర్తి వరకు 73 కి.మీ కాల్వను రెండో రీచ్ గా విభజించి రూ.375.54 కోట్లతో టెండర్లు పిలిచా రు. కొండపోచమ్మ సాగర్ దిగువన ఉన్న రావల్కోల్ కాల్వల ద్వారా శామీర్పేట్ చెరువు నింపడం, దాని కింద 31 కి.మీ.ల బొమ్మలరామారం కాల్వల ద్వారా 15,676 ఎకరాలకు నీరివ్వడం, ఇదే చెరువు నుంచి కీసర కాల్వ ద్వారా 20 కి.మీ మేర కాల్వలు తవ్వి 4,324 ఎకరాలకు నీళ్లిచ్చే పనులకు మరో రూ.353. 48 కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. ఈ నెల 8 నుంచి 21 వరకు టెండర్లు స్వీకరిస్తారు. 22న టెక్నిక ల్ బిడ్, 27న ప్రైస్ బిడ్ తెరుస్తారు. తక్కువ ధరకు కోట్ చేసిన ఏజెన్సీలకు పనులు అప్పగిస్తారు. మార్చిలోనే ఈ పనులను ఆరంభించే అవకాశాలున్నాయి.