మిగిలింది తొమ్మిది రోజులే.. | Election Time Municipality Problems In Medak | Sakshi
Sakshi News home page

మిగిలింది తొమ్మిది రోజులే..

Mar 22 2019 3:09 PM | Updated on Mar 22 2019 3:12 PM

Election Time Municipality Problems In Medak - Sakshi

చేర్యాల మున్సిపాలిటీ 

సిద్దిపేటజోన్‌: సరిగ్గా కేవలం తొమ్మిదిరోజుల గడువు.. కానీ మున్సిపాలిటీల ముందు కొండంత లక్ష్యం పేరుకుని ఉంది. నిర్దేశిత మార్చి 31నాటికి జిల్లాలోని ఐదు మున్సిపాలిటిల్లో 4కోట్ల  పైచీలుకు బకాయిలు వసూలు చేయాల్సిన లక్ష్యం ముందుంది. జిల్లా రికార్డుల ప్రకారం సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటిల్లో మార్చి 31వరకు 15కోట్ల ఆస్తి పన్నులు వసూలు చేయాల్సి ఉండగా నేటి వరకు 11కోట్లు వసూలు కావడం విశేషం. స్వల్ప సమయం ఉండడం రూ.4కోట్ల వసూళు చేయాల్సిన బాధ్యత బల్దియా అధికారులపై ఉందనే చెప్పాలి. మరోవైపు సిద్దిపేట మినహా మిగతా మున్సిపాలిటీల్లో నల్లా పన్నుల వసూలు నిరాశాజనకంగానే ఉన్నాయి.

2018–19 వార్షిక లక్ష్యానికి అనుగుణంగా బల్దియా అధికారులు పన్నుల వసూళ్ల ప్రక్రియను చేపట్టినప్పటికి మరో 9రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో లక్ష్యం సాధించడానికి స్పెషల్‌ డ్రైవ్‌ పేరిట ప్రణాళిక రూపకల్పనకు రంగం సిద్ధం చేయడం విశేషం. వివరాల్లోకి వెళ్తే జిల్లాలో స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపల్‌ సిద్దిపేటతో పాటు దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆయా మున్సిపల్‌ రికార్డుల ప్రకారం ప్రతి యేటా ఆర్థిక, వార్షిక ప్రణాళికకు అనుగుణంగా ఆస్తి, నల్లా పన్నుల వసూళ్లను రెవెన్యూ విభాగం చేపడుతుంది. ఈ క్రమంలోనే జిల్లాలోని ఆయా మున్సిపాలిటిల్లో 2018–19 ఆర్థిక సంవత్సరం ఈ నెల 31తో ముగియనుంది. ఆయా మున్సిపల్‌  రికార్డుల ప్రకారం ఇప్పటి వరకు సిద్దిపేట  మున్సిపాలిటీ పరిధిలో 25వేల పైచీలుకు అసెస్‌మెంట్‌లకు సంబంధించి రూ.9.61కోట్ల నిర్దేశిత వసూలు లక్ష్యానికి అనుగుణంగా నేటి వరకు 7.86కోట్ల రూపాయలను బల్దియా అధికారులు వసూలు చేశారు.

మిగిలిన 1.75 కోట్ల రూపాయల్లో అత్యధికం జిల్లా కేంద్రంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఆస్తి పన్ను పేరుకుని ఉంది. ఇప్పటి వరకు 82శాతం వసూలుతో జిల్లాలో సిద్దిపేట అత్యధికంగా పన్నులను వసూలు చేసినప్పటికి మరో తొమ్మిది రోజుల్లో భారీ లక్ష్యం ముందుందనే చెప్పాలి. దీనికి తోడు దుబ్బాక మున్సిపాలిటిలో రూ.90లక్షలకు గాను ఇప్పటి వరకు కేవలం రూ.32 లక్షలు వసూలు కావడం, అదే విధంగా చేర్యాల మున్సిపాలిటిలో రూ.74లక్షల ఆస్తి పన్ను వసూలుకు గాను కేవలం రూ.14లక్షలే నిరాశజనకంగా ఫలితాలతో ఉందనే చెప్పాలి.

మరోవైపు హుస్నాబాద్‌ మున్సిపాలిటీలో రూ.1.02కోట్ల ఆస్తి పన్ను వసూలు లక్ష్యానికి అనుగుణంగా ఇప్పటి వరకు రూ.65లక్షలను మాత్రమే అధికారులు పన్నురూపంలో వసూలు చేయడం గమనార్హం. మరోవైపు గజ్వేల్‌ మున్సిపాలిటీలో రూ.2.83కోట్లకు గాను ఇప్పటి వరకు రూ.2.19కోట్ల ఆస్తి పన్నును అధికారులు వసూలు చేశారు. ఇంకా రూ.64లక్షలు గజ్వేల్‌లో వసూలు చేయాల్సి ఉండగా ఇదే సమయంలో సిద్దిపేటలో రూ.1.75కోట్లు, దుబ్బాకలో రూ.32లక్షలు, హుస్నాబాద్‌లో రూ.18లక్షలు, చేర్యాలలో రూ.60లక్షలు మొత్తంగా ఈ నెలాఖరి నాటికి రూ.4కోట్ల రూపాయలను జిల్లాలోని ఆయా మున్సిపాలిటిల్లో ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement