అప్పుడు ధోని.. ఇప్పుడు మరో టికెట్‌ కలెక్టర్‌!

Another Tcket Collector On The Rise In Indian Cricket - Sakshi

ముంబై: ఎంఎస్‌ ధోని.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎలా అడుగుపెట్టాడో అందరికీ తెలిసిన విషయమే. స్పోర్ట్స్‌ కోటాలో టికెట్‌ కలెక్టర్‌గా ఉద్యోగం సంపాదించి తర్వాత దేశవాళీ మ్యాచ్‌ల్లో సత్తాచాటుకుని భారత జట్టులోకి ప్రవేశించాడు. ఆ తర్వాత ధోని తన అంతర్జాతీయ కెరీర్‌ను చిరస్మరణీయం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు మరో టికెట్‌ కలెక్టర్‌ కూడా టీమిండియా మేనేజ్‌మెంట్‌ తలుపులు తట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు.  అతనే ఢిల్లీకి చెందిన హిమాన్షు సంగ్వాన్‌ రంజీల్లో రైల్వేస్‌ తరఫున ఆడుతున్న ఈ ఫాస్ట్‌ బౌలర్‌ తన బౌలింగ్‌తో అద్భుతాలు చేస్తున్నాడు. ఇటీవల ముంబైతో జరిగిన మ్యాచ్‌లో మొత్తంగా ఆరు వికెట్లు సాధించి సత్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ మాత్రమే తీసిన సంగ్వాన్‌.. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు  సాధించి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. తన బౌలింగ్‌తో పటిష్టమైన ముంబైను బెంబేలెత్తించిన సంగ్వాన్‌.. పృథ్వీషా, అజింక్యా రహానే వంటి స్టార్‌ ఆటగాళ్ల వికెట్లను కూడా ఖాతాలో వేసుకుని ఇది తన పేస్‌ అంటూ టీమిండియా సెలక్టర్లకు సవాల్‌ విసురుతున్నాడు.

అయితే తన బౌలింగ్‌లో పదునుకు ఆసీస్‌ దిగ్గజం మెక్‌గ్రాత్‌ కారణం అంటున్నాడు సంగ్వాన్‌. మెక్‌గ్రాత్‌ పర్యవేక్షణలో నేను శిక్షణ పొందా. అతని పర్యవేక్షణలోనే ఎన్నో బంతుల్ని వేశా. ఆ క‍్రమంలోనే నా బౌలింగ్‌లో తప్పిదాలను సరిచేసుకున్నా. ప్రత్యేకంగా నోట్స్‌ రాసుకుంటూ బౌలింగ్‌ను మెరుగుపరుచుకున్నా. ప్రతీ సెషన్‌లోనూ నాకు మెక్‌గ్రాత్‌ అండగా నిలిచాడు. చాలా టెక్నికల్‌ విషయాలు మెక్‌గ్రాత్‌ నుంచే నేర్చుకున్నా. బేసిక్స్‌తో పాటు ఓపికగా ఎలా బౌలింగ్‌ చేయాలి అనేది మెక్‌గ్రాత్‌ సార్‌ చెప్పారు. ఈ రెండు విషయాల్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలనేది నాకు మెక్‌గ్రాత్‌ సార్‌ చెప్పిన సూత్రం. అతని మార్గదర్శకత్వమే నన్ను రాటు దేలేలా చేసింది. నా బౌలింగ్‌ క్రెడిట్‌ అంతా మెక్‌గ్రాత్‌ సార్‌కే చెందుతుంది’ అని సాంగ్వాన్‌ చెప్పుకొచ్చాడు.

ఇక పృథ్వీషా, రహానేలను ఎలా కట్టడి చేశాననే దానిపై కూడా సాంగ్వాన్‌ స్పష్టం చేశాడు. ‘ పృథ్వీ షా ఒక ఎటాకింగ్‌ ప్లేయర్‌. ఎప్పుడూ దూకుడుగా ఆడటంపైనే షా దృష్టి పెడతాడు. ప్రత్యేకంగా పృథ్వీ షా కొన్ని ఏరియాల్లో బంతుల్లు సంధించా. నా పేస్‌ను చేంజ్‌ చేస్తూ అతని బౌలింగ్‌ చేశా. అది ఫలించింది. రహానే విషయంలో కూడా ఒక ప్రణాళికతోనే బరిలోకి దిగా. వరల్డ్‌లో అత్యుత్తమ టెస్టు బ్యాట్స్‌మన్‌లలో రహానే ఒకడు. భారత టెస్టు క్రికెట్‌ జట్టు రహానే వైస్‌ కెప్టెన్‌ కూడా. కచ్చితమైన ఏరియాల్లో బంతులు వేయడమే కాకుండా అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ స్టంప్‌పై ఆడేలా బంతులు వేశా. దాంతో రహానే వికెట్‌ కూడా దక్కింది. ఇద్దరికీ ప్రణాళికలు సిద్ధం చేసుకునే పోరుకు సిద్ధమయ్యా’ అని 24 ఏళ్ల  సాంగ్వాన్‌ అన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top