సీఎం అల్టిమేటం; లెక్కచేయని వైద్యులు
కోల్కతా/న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో జూనియర్ వైద్యుల ఆందోళన కొనసాగుతోంది. ఈ మధ్యాహ్నం 2 గంటల్లోపు ఆందోళన విరమించకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించినా వైద్యులు వెనక్కి తగ్గలేదు. ప్రతి మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో తమ రక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకునే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరోవైపు జూనియర్ వైద్యుల బృందం గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠిని కలిసింది. జూన్ 10న ఎన్ఆర్ఎస్ ఆస్పత్రిలో వైద్యులపై దాడి చేసిన వారిన తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్కు విజ్ఞప్తి చేసింది. తమ డిమాండ్లను ఒప్పుకుంటే ఆందోళన విరమిస్తామని తెలిపింది. కాగా, వైద్యుల సమ్మెపై తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.
బెంగాల్ వైద్యులకు సంఘీభావంగా ఢిల్లీలోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో రెసిడెంట్ డాక్టర్లు వినూత్న నిరసన చేపట్టారు. హెల్మెట్లు ధరించి విధులకు హాజరైయ్యారు. తలకు, చేతులకు బ్యాండెజ్లు ధరించి నిరసన తెలిపారు. రోగులను కాపాడే వైద్యులపై దాడులు వద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. (చదవండి: బీజేపీ, సీపీఎం దోస్తీపై దీదీ ఫైర్)