బంగ్లాదేశ్‌లో ‘ఫొని’ బీభత్సం | 14 killed bangladesh on fani cyclone | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌లో ‘ఫొని’ బీభత్సం

May 5 2019 5:15 AM | Updated on May 5 2019 5:15 AM

14 killed bangladesh on fani cyclone - Sakshi

తుపాను ధాటికి పూర్తిగా దెబ్బతిన్న పూరీ దగ్గర్లోని ఓ రైల్వే స్టేషన్‌

ఢాకా/భువనేశ్వర్‌: భారత్‌లోని ఒడిశా రాష్ట్రాన్ని వణికించిన పెను తుపాన్‌ ‘ఫొని’ శనివారం బంగ్లాదేశ్‌ తీరాన్ని తాకింది. తుపాను ప్రభావంతో భారీ వర్షాలకు తోడుగా వాగులు, వంకలన్నీ ఉప్పొంగడంతో బంగ్లాదేశ్‌లో ఒక్కరోజే 14 మంది ప్రాణాలు కోల్పోగా, 63 మంది గాయపడ్డారు. కుండపోత వర్షాలతో నదులు పొంగడంతో 36 గ్రామాలు నీటమునిగాయి. 16 లక్షల మంది ప్రజలను బంగ్లా అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బలమైన ఈదురు గాలులకు 8 తీరప్రాంత జిల్లాల్లో వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి.

ఒడిశాలో 16కు చేరుకున్న మృతులు
ఒడిశాలో ‘ఫొని’ పెను తుపాను కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 16కు చేరుకుంది. ఫొని ప్రభావంతో శుక్రవారం నాటికి 8 మంది చనిపోగా, ఈ సంఖ్య తాజాగా 16కు పెరిగింది. కాగా, ఫొని భారత తీరానికి దూరంగా వెళ్లిపోవడంతో సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు.  రాష్ట్రంలో కుప్పకూలిన 10,000 విద్యుత్‌ స్తంభాలను పునరుద్ధరిస్తున్నామని వెల్లడించారు. ప్రధాని మోదీ  ‘ఫొని’ ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్నట్లు ఒడిశా సీఎం కార్యాలయం తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement