పిల్లలు కావడం లేదని భార్యను...

Women Murder In Warangal - Sakshi

నల్లబెల్లి: మూడుముళ్లు వేసి కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. పిల్లలు కావడం లేదని కట్టుకున్న భార్య చిక్కుడు అశ్విని(25)ని భర్త ముకేష్‌ హత్య చేసిన సంఘటన ఆలస్యంగా మండలంలోని బోల్లోనిపల్లిలో గురువారం వెలుగుచూసింది. మృతురాలి తల్లిదండ్రులు ఉస్తం భద్రమ్మ, వెంకటయ్య, సోదరుడు అశోక్‌ల కథనం ప్రకారం... పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన భద్రమ్మ, వెంకటయ్య దంపతుల కుమార్తె అశ్వినిని ఆరేళ్ల క్రితం మండలంలోని బోల్లోనిపల్లి గ్రామానికి చెందిన చిక్కుడు ముకేష్‌కు ఇచ్చి వివాహం చేశారు.

వీరి దాంపత్య జీవితం రేండేళ్ల వరకు సజావుగానే సాగింది. కుల వృత్తిలో భాగంగా కాటిపాపల కథలు చెబుతూ జీవనం కొనసాగించేవారు. పిల్లలు కావడం లేదని ఆస్పత్రులు తిరుగుతున్నారు. అశ్విని గర్భసంచిలో లోపం ఉండడంతో పిల్లలు కావడం లేదని వైద్యులు చెప్పడంతో రెండేళ్లుగా ముకేష్‌తో పాటు కుటుంబ సభ్యులు వేధిస్తున్నారు. కుల వృత్తిలో భాగంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని రాయిగూడెంకు కథలు చెప్పేందుకు అశ్విని, ముకేష్‌ దంపతులు వెళ్లారు.

ఈ క్రమంలో పిల్లలు కావడం లేదు బంధువుల అమ్మాయిని రెండో పెళ్లి చేసుకొంటానని అశ్వినితో గొడవపడి భర్తతో పాటు అతని బంధువులు కలిసి మంగళవారం కొట్టిచంపి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. రాయిగూడెంలో చంపిన తమ బిడ్డను గుట్టుచప్పుడుగా బోల్లోనిపల్లికి తీసుకవచ్చి దహన సంస్కారాలు చేసేందుకు ప్రయత్నించిన అత్తింటివారిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులను వేడుకుంటున్నారు. ఈ మేరకు ఎస్సై నరేందర్‌రెడ్డిని వివరణ కోరగా మృతదేహాన్ని తీసుకొని సంఘటన జరిగిన నేలకొండపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఫిర్యాదు చేయాలని మృతురాలి బంధువులకు సూచించడంతో మృతదేహాంతో వారు అక్కడికి వెళ్లారని తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top