‘అధికారమన్నది చెలాయించడానికి కాదు సేవచేయడానికి’
సాక్షి, తాడేపల్లి: అధికారమన్నది చెలాయించడానికి కాదని సేవచేయడానికని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తన దగ్గరి నుంచి కింది స్థాయి అధికారి వరకూ ప్రతీ ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. స్పందన కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మనందరం పబ్లిక్ సర్వెంట్స్ అనే విషయాన్ని మర్చిపోవద్దని అధికారులకు సూచించారు. అవినీతి అంశం మీద పోరాటాన్ని అగ్రెసివ్గా తీసుకోవాలని, ఎక్కడా అవినీతికి చోటు లేదన్న విషయం కింది స్థాయి అధికారి వరకూ చేరాలని పేర్కొన్నారు. అవినీతి నిరోధక శాఖ చాలా చురుగ్గా పనిచేస్తోందని ప్రశంసించారు. అంతేకాకుండా వచ్చే రెండు మూడు వారాల్లో ఏసీబీని పెద్ద ఎత్తున రంగంలోకి దించుతున్నట్లు సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.
‘స్పందనలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత కోసం స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్పై ఇప్పటికే 6 జిల్లాల్లో శిక్షణ, అవగాహన కార్యక్రమాలు పూర్తయ్యాయి. మిగిలిన చోట్ల కూడా త్వరలో ప్రారంభమవుతాయి. కలెక్టర్లు, ఎమ్మార్వోలు, ఎస్పైలు, మున్సిపల్ కమిషనర్లు, తదితర అధికారులు ఈ శిక్షణ కార్యక్రమంలో ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలి. వినతుల పరిష్కారంలో నాణ్యత అనేది చాలా ముఖ్యం. దానికోసమే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. అర్జీ తీసుకువస్తున్న వ్యక్తిని మనం ట్రీట్ చేస్తున్న విధానం చాలా ముఖ్యమైంది. మనం ఒక అర్జీతో ఎవరిదగ్గరకైనా వెళ్లినప్పుడు మనకు ఎలాంటి స్పందన కావాలని కోరకుంటామో అలాంటి స్పందననే అధికారులు చూపించాలి. పబ్లిక్ మీద అథారిటీ చెలాయించడానికి కాదు మనం ఉన్నది, మనం పబ్లిక్ సర్వెంట్లమన్న విషయాన్ని మర్చిపోవద్దు’అంటూ సీఎం జగన్ పేర్కొన్నారు.