శివరాత్రికి పటిష్ట ఏర్పాట్లు
భీమవరం: రానున్న మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్ ఆదేశించారు. గురువారం ఆయన జిల్లాలో పర్యటించి భీమవరం వన్టౌన్, కాళ్ల పోలీస్స్టేషన్ల పనితీరుపై సమీక్షించారు. పంచారామక్షేత్రం భీమవరంలో సోమేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, క్యూలైన్ల నిర్వహణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘాపై సూచనలు ఇచ్చారు. వార్షిక తనిఖీల్లో భాగవంగా ఆయా పోలీస్స్టేషన్లను పరిశీలించి రికార్డులు, కేసుల దర్యాప్తుపై ఆరా తీశారు. ప్రజలకు పోలీసు సేవలపై నమ్మకం కలిగించేలా ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలన్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్–1 ఫలితాల్లో ప్రతిభ చూపిన భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్ రైటర్ (హెడ్ కానిస్టేబుల్) గురుజు దివాకర్ కుమార్తె లక్ష్మీ అంజనను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఏఎస్పీ వి.భీమారావు, డీఎస్పీ రఘువీర్ విష్ణు, సీఐలు, ఎస్సైలు ఉన్నారు.


