చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ డిమాండ్
వీరవాసరం: తిరుపతి లడ్డూ కల్తీ విషయంలో చంద్రబాబు కచ్చితంగా ప్రజలకు ,శ్రీవారి భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ శెట్టిబలిజ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు కవురు శ్రీనివాస్ మంగళవారం డిమాండ్ చేశారు. తిరుమల ప్రసాదం అంటే సందేహించే స్థాయికి చంద్రబాబు తన తప్పుడు ప్రచారంతో తీసుకెళ్లారని ఇంతకన్నా ఘోరం ఏముంటుందని తీవ్రంగా ఆక్షేపించారు. లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతు కొవ్వు లేదని దేశంలోనే ప్రతిష్టాత్మక ల్యాబ్లు చెప్పాయన్నారు. ప్రజల దృష్టిలో పూర్తిగా కిందకు పడిపోయిన చంద్రబాబు మళ్లీ ఏదో రకంగా తన అబద్ధాలు నిజాలని చెప్పడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజలంతా దీన్ని గమనిస్తున్నారని వివరించారు. అన్ని రకాల రిపోర్టులను చూసిన తర్వాతే చార్జిషీట్ వేశారని.. మరి ఎందుకు చంద్రబాబు కుట్రలు మీద కుట్రలు చేస్తున్నారని ప్రశ్నించారు. పరిపాలనలో ఘోరంగా విఫలమయ్యారని, ప్రజలంతా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.


