‘పది’ ఫలితాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి
భీమవరం: పదో తరగతి ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో పదో తరగతి పరీక్షల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుఫై బుధవారం ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కచ్ఛితంగా అమలు చేయాలన్నారు. పాఠశాలలకు విద్యార్థులు సక్రమంగా హాజరయ్యేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నది తల్లిదండ్రులు గమనించాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, ఎంతమంది రైజింగ్ స్టార్స్, షైనింగ్ స్టార్స్ ఉన్నారు, మార్కులు ఎలా వస్తున్నాయి అనే అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ పరిశీలన చేశారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల హాజరు, సబ్జెక్టుల వారీగా పురోగతిపై మండలాల వారీగా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్షించారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, డిప్యూటీ విద్యాశాఖ అధికారులు ఎన్.రమేష్, ఎం.మురళి సత్యనారాయణ, ఎంఈఓలు, హెచ్ఎంలు పాల్గొన్నారు.


