ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేతపై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్ : ఉస్మానియా ఆస్పత్రి పురాతన కట్టడం కావడంతో పక్కన ఉన్న స్థలంలో నూతన భవనం నిర్మించుకోవచ్చని తెలంగాణ హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేత, నూతన నిర్మాణంపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఆస్పత్రి గూగుల్ మ్యాప్, ప్లాట్ లే అవుట్ కాపీలను అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు సమర్పించారు. వీటిని పరిశీలించి వాదనలు వినిప్తామని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేస్తూ హైకోర్టు పేర్కొంది. (కోవిడ్ పరీక్షలపై కౌంటర్ దాఖలకు ఆదేశం)
అదే విధంగా పింఛనర్ల పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పింఛనర్ల పిటిషన్పై ప్రభుత్వం సానుకూలంగా ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రభుత్వ తరపు అడ్వొకేట్ జనరల్ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. అసెంబ్లీ సమావేశాలోపు పింఛనర్లపై సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని వెల్లడించింది. లేని పక్షంలో తగిన ఆదేశాలు ఇస్తామని పేర్కొంది. తదుపరి విచారణను అక్టోబర్ 1కు వాయిదా వేసింది.