ఆత్మగౌరవానికి ప్రతీక దామోదరం సంజీవయ్య
ప్రశాంతి నిలయం: అట్టడుగు వర్గాల్లో జన్మించిన విలువలతో కూడిన రాజకీయాలు చేసిన తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని వక్తలు కొనియాడారు. శనివారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో కలెక్టర్ శ్యాం ప్రసాద్ అధ్యక్షతన దామోదరం సంజీవయ్య 105వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత సంజీవయ్య చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ... వివక్షను ఎదుర్కొన్న కాలంలోనే విద్యతో ఉన్నత స్థాయికి చేరుకుని విద్య ప్రాముఖ్యతను సమాజానికి చాటి చెప్పిన మహనీయుడు సంజీవయ్య అన్నారు. సంజీవయ్య బాటలో నడుస్తూ సమ సమాజ నిర్మాణానికి అందరం కృషి చేయాలన్నారు. పేదల సంక్షేమం కోసం సుమారు 6 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసిన గొప్ప పాలకుడని, వృద్ధాప్య పింఛన్ల పథకానికి రూప కల్పన చేసిన దార్శనికుడన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డీఆర్ఓ రామసుబ్బయ్య, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రెడ్డి బాలాజీ, ఆర్డీఓ సువర్ణ పాల్గొన్నారు.
తాగునీటి సమస్య పరిష్కారం
రొద్దం: మండల పరిధిలోని ఆర్. మరువపల్లి గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను అధికారులు పరిష్కరించారు. వారం రోజులుగా బోరు చెడిపోయి గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ ‘ఆర్. మరువపల్లిలో దాహం కేకలు’ శీర్షికన శనివారం ‘సాక్షి’ కథనం ప్రచురించింది. స్పందించిన ఈఓఆర్డీ గోవిందప్ప శనివారం ఉదయమే గ్రామాన్ని సందర్శించారు. సిబ్బందితో కలిసి బోరుకు మరమ్మతులు చేయించి తాగునీటి సమస్యను పరిష్కరించారు.
ఆత్మగౌరవానికి ప్రతీక దామోదరం సంజీవయ్య


