అదే మా కొంపముంచింది.. అతడు మాత్రం అద్భుతం: శ్రేయస్‌ | Rajasthan Royals Chase Down 223 Against Punjab Kings As Shreyas Iyer Admits Bowling Failure In IPL 2026 Clash | Sakshi
Sakshi News home page

అదే మా కొంపముంచింది.. అతడు మాత్రం అద్భుతం: శ్రేయస్‌

Apr 29 2026 8:47 AM | Updated on Apr 29 2026 10:30 AM

Shreyas Iyer reflects on PBKSs defeat versus RR

ఐపీఎల్‌-2026లో పంజాబ్ కింగ్స్‌కు తొలి ఓట‌మి ఎదురైంది. మంగ‌ళ‌వారం ముల్లాన్‌పూర్ వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పంజాబ్ ప‌రాజ‌యం పాలైంది. 223 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని పంజాబ్ బౌల‌ర్లు కాపాడుకోలేక‌పోయారు. ఈ కొండంత ల‌క్ష్యాన్ని రాజ‌స్తాన్ కేవ‌లం 4 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 19.2 ఓవ‌ర్ల‌లో ఊదిప‌డేసింది.

రాయ‌ల్స్‌ బ్యాట‌ర్ల‌లో యశస్వి జైస్వాల్ (51), డోనోవన్ ఫెరీరా ( 26 బంతుల్లో 52*), వైభ‌వ్ సూర్య‌వంశీ(43), శుభమ్ దూబే(12 బంతుల్లో 31) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. త‌మ‌కు ఎదురైన తొలి ప‌రాజ‌యంపై మ్యాచ్ అనంత‌రం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ స్పందించాడు. బౌలింగ్ వైఫ‌ల్యం కార‌ణంగానే తాము ఓడిపోయామ‌ని అయ్య‌ర్ చెప్పుకొచ్చాడు.

"ఈ వికెట్‌పై 222 ప‌రుగులు చేయ‌డం చాలా గొప్ప విష‌యం. పిచ్ కాస్త నెమ్మ‌దిగా ఉన్న‌ప్ప‌టికి మా బ్యాట‌ర్లు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. క‌చ్చితంగా వారికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. అయిన‌ప్ప‌టికి ఈ భారీ స్కోర్‌ను డిఫెండ్ చేసుకోలేక‌పోవ‌డం నిరాశ క‌లిగించింది. బౌలింగ్‌లో మా ప్ర‌ణాళిక‌ల‌ను స‌రిగ్గా అమలు చేయ‌లేక‌పోయాము.  మేము ఎక్కువగా స్లో బాల్స్, యార్కర్లు వేయాలని ప్లాన్ చేసుకున్నాం.

కానీ మేము అనుకున్న‌ది చేయ‌లేక‌పోయాము. మిడిల్ ఓవ‌ర్ల‌లో రాజ‌స్తాన్ బ్యాట‌ర్లు అద్భుత‌మైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా ఫెరీరా, శుభమ్ దుబే చివ‌రి ఓవ‌ర్ల‌లో కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. వారిద్ద‌రి మ‌ధ్య నెల‌కొన్ని భాగ‌స్వామ్యమే మ్యాచ్‌ను మా నుంచి దూరం చేసింది. ప్ర‌స్తుతం టీ20 ఫార్మాట్‌లో బ్యాట‌ర్లు మొద‌టి బంతి నుంచే విరుచుకుప‌డుతున్నారు.

కాబ‌ట్టి బౌల‌ర్లు పక్కా ప్లాన్‌తో రావడం కష్టమైన పని. ఈ రోజు మాకు బౌలింగ్‌లో క‌లిసిరాలేదు అంతే. ఇక నిరంత‌ర ప్ర‌యాణాలు, మ్యాచ్‌ల వ‌ల్ల మేము కాస్త అలిసిపోయాము. కానీ దాన్ని సాకుగా చెప్పలేము. మా త‌దుప‌రి మ్యాచ్‌కు కాస్త విరామం దొరికింది. మ‌ళ్లీ మా ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసుకుని బ‌లంగా తిరిగి వ‌స్తాం.

ఈ సీజ‌న్‌లో మాకు ఇది తొలి ఓట‌మి. ఈ ఓట‌మి నుచి చాలా పాఠాలు నేర్చుకున్నాము. మేము ఇప్పటికే 200 పరుగులకు పైగా ఛేజ్ చేశాం, అదే టార్గెట్‌ను డిఫెండ్ కూడా చేశాం. కాబ‌ట్టి ఈ మ్యాచ్ ఫ‌లితం గురుంచి పెద్దగా ఆలోచించం. అదేవిధంగా ఈ మ్యాచ్‌లో మా స్పిన్న‌ర్లు హ‌ర్‌ప్రీత్ బ్రార్‌, చాహ‌ల్ అద్భుతంగా రాణించారు. 

ముఖ్యంగా హ‌ర్‌ప్రీత్‌కు ఈ సీజ‌న్‌లో ఇదే తొలి మ్యాచ్. అయిన‌ప్ప‌టికి అత‌డు త‌న 4 ఓవర్లలో కేవలం 25 పరుగులు ఇచ్చి మా టీమ్‌లో బెస్ట్‌ బౌలర్‌గా నిలిచాడు"అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేష‌న్‌లో అయ్య‌ర్ పేర్కొన్నాడు. పంజాబ్ త‌మ త‌దుపరి మ్యాచ్‌లో మే 3న అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది.
చదవండి: IPL 2026: జైలుకు రియాన్ ప‌రాగ్‌?
 

Advertisement
 
Advertisement
Advertisement