ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో 3 విజయాలు, 3 అపజయాలతో నాట్ గుడ్ నాట్ బ్యాడ్ అన్నట్లుగా సాగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్కు ఇకపై మంచి రోజులు రానున్నాయి. స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ టోర్నీలో పాల్గొనేందుకు తన జాతీయ బోర్డు (క్రికెట్ ఆస్ట్రేలియా) నుంచి గ్రీన్ సిగ్నల్ పొందాడు. స్టార్క్ మే 1 నుంచి అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
స్టార్క్ గాయాలు, వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కారణంగా ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్లకు దూరమైన విషయం తెలిసిందే. ఇప్పుడు అతను గాయాల నుంచి పూర్తిగా కోలుకొని జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ధృవీకరించింది. స్టార్క్ పూర్తిగా కోలుకొని, ఫిట్నెస్ ప్రోగ్రామ్ను కూడా పూర్తి చేసుకున్నట్లు ప్రకటన విడుదల చేసింది.
స్టార్క్ రాక ఢిల్లీ బౌలింగ్ విభాగానికి మరింత బూస్టప్ ఇస్తుంది. ఆ జట్టు ఇప్పటికే ఎంగిడి, ముకేశ్ కుమార్, నటరాజన్ వంటి పేసర్లతో కలకలలాడుతుంది. స్పిన్ విభాగంలోనూ ఢిల్లీ చాలా పటిష్టంగా ఉంది. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ వంటి అత్యుత్తమ స్పిన్నర్లు ఈ జట్టులోనే ఉన్నారు.
ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో ఢిల్లీకి బౌలింగ్ విభాగంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. బౌలర్లు సమిష్టిగా రాణిస్తూ జట్టు విజయాలకు దోహదపడ్డారు. బ్యాటింగ్లోనే ఢిల్లీ కాస్త తడబడుతుంది. కేఎల్ రాహుల్, డేవిడ్ మిల్లర్, సమీర్ రిజ్వి పర్వాలేదనిపిస్తున్నా.. మిగతా బ్యాటర్లు చెప్పుకోదగ్గ ప్రదర్శలను ఇవ్వలేకపోతున్నారు. ఈ జట్టు తదుపరి మ్యాచ్లో పటిష్టమైన పంజాబ్ కింగ్స్తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 25న మధ్యాహ్నం జరుగనుంది.


