ఆ ఫలితాలు గుడ్డిలో మెల్ల
● అసెంబ్లీ ఎన్నికలే గీటురాయి: తలసాని ● బీఆర్ఎస్ కేడర్ ధైర్యంగా పోరాడిందని కితాబు
సిద్దిపేటజోన్: రాజకీయ వ్యవస్థలో ప్రభుత్వాలు ఎప్పుడూ శాశ్వతం కాదు.. అవి వస్తుపోతుంటాయి. ప్రజలే శాశ్వతం. ప్రజలకు చేసిన మంచి పనులు గీటురాయిగా గుర్తించాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వార్ వన్ సైడ్గా అభివర్ణించడాన్ని ఆయన తప్పుబట్టారు. బల్దియా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఫలితాలు గుడ్డిలో మెల్లగా అభివర్ణించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి ప్రచారం చేయడం విడ్డురంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని అధికారం నడిపిస్తోందని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో డబ్బులు, మద్యం, ఏరులై పారిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కాదని, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గీటు రాయిగా పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు సరైన గుణపాఠం చెబుతారని జోస్యం చెప్పారు. అబద్ధాల పునాదుల మీద, దొంగ హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తలసాని విమర్శించారు. బల్దియా ఎన్నికల్లో బీఆర్ఎస్ క్యాడర్ దైర్యంగా పోరాటం చేసి విజయం సాధించినట్టు పేర్కొన్నారు. ఆర్టీసీ ప్రయాణంలో మహిళకు ఉచితం అని పురుషులకు రెట్టింపు చార్జీలను విధించిందన్నారు. కాంగ్రెస్ హయాంలో రియల్ రంగం కుదేలు అయిందన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించడం ఒక అద్భుతమైన ఘట్టంగా తలసాని అభివర్ణించారు.


