ఓడేదెవరు? గెలిచేదెవరు?
● కొద్ది గంటల్లో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
● 72 వార్డుల్లో 326 మంది పోటీ
● ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం కొద్ది గంటల్లో తేలనుంది. కౌన్సిలర్గా గెలిచేదెవరు?.. ఓడేదెవరో శుక్రవారం తేలిపోనుంది. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలకు ఓటింగ్ జరగగా 82.03శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలలో 72 వార్డుల్లో 326 మంది అభ్యర్థులు పోటీ చేశారు. నాలుగు మున్సిపాలిటీలలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం జిల్లా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. – సాక్షి, సిద్దిపేట
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఆయా మున్సిపల్ ఎన్నికల అధికారులు కౌంటింగ్ సిబ్బందికి సూచనలు చేశారు. ఉదయం 8గంటలకు ప్రారంభం కానున్న ఈ ఓట్ల లెక్కింపు రౌండ్లుగా చేపట్టనున్నారు. జిల్లా వ్యాప్తంగా 35 టేబుళ్లను ఏర్పాటు చేశారు. చేర్యాలకు సంబంధించి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో, దుబ్బాకలో లచ్చపేట తెలంగాణ మోడల్ స్కూల్, గజ్వేల్లో బాలికల ఎడ్యుకేషన్ హబ్, హుస్నాబాద్లో తెలంగాణ మోడల్ స్కూల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాలలలో కౌంటింగ్ కోసం ఏడు టేబుళ్ల చొప్పున, గజ్వేల్లో 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొదట చేర్యాలకు సంబంధించిన 10వ వార్డు తొలి ఫలితం రానుంది.
తేలనున్న
భవితవ్యం
326 మంది అభ్యర్థుల్లో 72 మంది విజేతలు నిలవనున్నారు. బ్యాలెట్ బాక్స్లు తెరవనుండటంతో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. గెలుస్తామని ఎవరి ధీమాతో వారున్నారు. మరో వైపు ఆందోళన సైతం వెంటాడుతోంది. పలువురు అభ్యర్థులు, ఆయా పార్టీల ముఖ్యనాయకులు పోలింగ్ ఆధారంగా లెక్కలు వేస్తున్నారు. ఎవరెవరికీ ఎన్ని ఓట్లు పడి ఉంటాయని చర్చించుకుంటన్నారు. మరోవైపు జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. అభ్యర్థులతో పాటు బెట్టింగ్లు పెట్టిన వారు సైతం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
మున్సిపాలిటీ ఓటేసిన పోస్టల్ మొత్తం
వారు బ్యాలెట్
చేర్యాల 11,491 41 11,532
దుబ్బాక 18,147 35 18,182
గజ్వేల్ 37,088 39 37,127
హుస్నాబాద్ 16,192 83 16,275


