అందరిచూపు గజ్వేల్పైనే..
గజ్వేల్: గజ్వేల్– ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు రంగం సిద్ధం కావడంతో వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు గెలుపోటముల అంచనాలో నిమగ్నమయ్యారు. ఎవరి కోణంలో వారు లెక్కలేసుకుంటున్నారు. 2020 మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు 13మంది, స్వతంత్రులు ఆరుగురు, ఒకే ఒక కౌన్సిలర్ స్థానాన్ని మాత్రమే కాంగ్రెస్ గెలుచుకున్నది. కానీ తర్వాత స్వతంత్రులపాటు కాంగ్రెస్ అభ్యర్థి సైతం బీఆర్ఎస్లో చేరిపోయారు. ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం ఫలితాలు ఈసారి భిన్నంగా వచ్చే అవకాశం కనిపిస్తున్నది. మరికొన్ని గంటల్లో ఫలితాలు వెలువడనుండగా.. సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలతో పోలిస్తే ఈ మున్సిపాలిటీపై అందరి ఆసక్తి నెలకొన్నది. మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిథ్య నియోజకవర్గం కావడమే ఇందుకు కారణం. ఇటీవల గజ్వేల్ నియోజకవర్గ పంచాయతీ ఎన్నికల ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేకంగా విశ్లేషించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికల ఫలితాలపైనా అందరి దృష్టి కేంద్రీకృతమై ఉన్నది.
విమర్శలకు పదును పెట్టి..
ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్పై విమ్శరలను ఎక్కుపెట్టింది. కేసీఆర్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు పెండింగ్లో ఉన్నాయని, మల్లన్నసాగర్ నిర్వాసితులకు సైతం ఎన్నో సమస్యలు ఉన్నాయని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో అధిక స్థానాలు వస్తాయనే అంచనాలో కాంగ్రెస్ నేతలున్నారు. ఇకపోతే బీఆర్ఎస్ సైతం మెజార్టీ స్థానాలు గెలుచుకుంటామనే ధీమాలో ఉంది. కేసీఆర్ చొరవ వల్లే గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27నెలలు గడుస్తున్నా... గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి ఒరిగిందేమీలేదని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇకపోతే ఇప్పటివరకు మున్సిపాలిటీలో ఖాతా తెరవని బీజేపీ సైతం తన ప్రాభల్యాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది.
ఫలితాలపై సర్వత్రా ఆసక్తి


