బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
● 14 నుంచి మైసిగండి కాశీవిశ్వనాథస్వామి ఉత్సవాలు
● వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరం చేసిన అధికారులు
కడ్తాల్: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మైసిగండి పరిధిలో కొలువైన శివాలయంలో ఈనెల 14 నుంచి నిర్వహించనున్న కాశీ విశ్వనాథస్వామి బ్రహ్మోత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయి. ఏటా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ కాశీవిశ్వనాథస్వామి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. ఇవి శనివారం ప్రారంభమై సోమవారం వరకు కొనసాగుతాయి. ఈ ఉత్సవాలను తిలకించేందుకు జిల్లాతో పాటు సమీప జిల్లాల నుంచి భక్తులు తరలిరానుండటంతో శివాలయాన్ని సర్వంగా సుందరంగా అలంకరిస్తున్నారు. అందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మైసిగండిలో ప్రస్తుత శివాలయ, రామాలయ క్షేత్రాలు రుగ్వేద కాలంలో గంగా గుళ్లుగా పిలువబడేదని ఆలయ చరిత్ర తెలుపుతోంది. ఆలయాల్లో గోల్కొండ నవాబుల కాలంలో అక్కన, మాదన్నల మహామంతుల్రుగా ఉన్న సమయం నుంచి పూజలు జరిగేవి. తర్వాతి కాలంలో ఆలయాన్ని వైభవంగా పునర్నిర్మించారు.
కార్యక్రమాల వివరాలు
ఉత్సవాల్లో మొదటిరోజు శనివారం విఘ్నేశ్వరపూజ, ధ్వజారోహణం, మహాన్యాసపూర్వక ఏకదశ రుద్రాభిషేకం, 15వ మహాశివరాత్రిని పురస్కరించుకొని శివపార్వతుల కల్యాణ మహోత్సవం, రాత్రికి ప్రత్యేక అభిషేకం, అనంతరం రథోత్సవం, 16న స్వామివారికి ఏకాదశ కలశాభిషేకం, వసంతోత్సవం, పూర్ణహూతి కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈవో స్నేహలత, ఆలయ ట్రస్టీ శిరోలీ పేర్కొన్నారు.
ఇబ్బంది కలగనీయం
మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు మైసిగండి శివాలయ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులకు తాగునీటి వసతి, సౌకర్యాలను కల్పిస్తున్నాం. మూడు రోజుల పాటు నవగ్రహ, గణపతి హోమం నిర్వహిస్తారు.
– స్నేహలత, ఈఓ, మైసిగండి
బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం


