సాధనే లక్ష్యం వైపు నడిపిస్తుంది..
ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్
పంజగుట్ట : ప్రతి మనిషిలోనూ ఏదో సాధించాలన్న తపన ఉండాలని, ఆ నమ్మకమే వారిని గొప్పవారిగా తీర్చిదిద్దుతోందని ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ అన్నారు. క్రికెట్లో సత్తా చాటుతున్న నల్లగొండ జిల్లా, బొడ్డుపల్లికి చెందిన కుమారి స్రవంతికి మైత్రి సేవ ఫౌండేషన్ సంస్థ క్రికెట్ కిట్, సంవత్సరం పాటు పౌష్టికాహారం అందించేందుకు ఆర్థికసాయంతో పాటు లక్ష రూపాయల చెక్కును సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆదివారం అందించారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రయోజకులు కావాలన్న తాపత్రయంతో నానా కష్టాలు పడుతూ పట్టణల్లో పిల్లల్ని చదివిస్తుంటే, కొంతమంది చెడువ్యసనాలకు బానిసలు కావడం బాధాకరమన్నారు రామ్, లక్ష్మణ్. తన కోసం, తన కుటుంబం కోసం చూడకుండా ఓ ప్రైవేట్ కాలేజీలో 2004 బ్యాచ్ కంప్యూటర్ సైన్స్ చదివిన విద్యార్థులు ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. ఫౌండేషన్ వైస్ చైర్మన్ తిరుపతయ్య, ఆర్గనైజర్స్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అదే లక్ష్యం..
క్రికెట్ పట్ల ఆసక్తి ఉన్న స్రవంతి తన 11వ ఏట నుండే క్రికెట్ నేర్చుకుంటోంది. అండర్ 15 స్టేట్, అండర్ 19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నేషనల్ లెవల్లో ఆడింది. కృష్ణా జిల్లా టీంకు కెప్టెన్గా వ్యవహరించింది. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న స్రవంతి మున్ముందు భారత మహిళా క్రికెట్ టీంలో ఆడాలన్నదే లక్ష్యమని చెబుతోంది.


