హామీలు మరిచి గాలిమాటలు
● కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్న రేవంత్రెడ్డి
● మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి సబితారెడ్డి
మొయినాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ గాలిమాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారం, మొయినాబాద్, సురంగల్, అప్పోజీగూడ, చిలుకూరు, హిమాయత్నగర్లోని వార్డుల్లో ఆదివారం ఆమె ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమమే ఇప్పటికీ కనిపిస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ప్రజలకు ఏం చేసిందో సీఎం రేవంత్రెడ్డి చెప్పాలని నిలదీశారు. ప్రజలను మోసం చేస్తున్న పార్టీకి బుద్ధి చెప్పాలంటే కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో ఎన్నికల ఇన్చార్జిలు జయసింహ, అమృత్లాల్ చౌహాన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, కొత్త నర్సింహారెడ్డి, సీనియర్ నాయకులు ఆంజనేయులు, స్వప్న, నరోత్తంరెడ్డి, మహబూబ్, జగన్మోహన్రెడ్డి, వెంకట్రెడ్డి, రవూఫ్, జయవంత్ తదితరులు పాల్గొన్నారు.


