రెబల్స్పై చర్యలు తప్పవు
శంకర్పల్లి: కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకునేందుకు పార్టీ సమాయత్తమవుతోందని శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహ్మారెడ్డి స్పష్టంచేశారు. శంకర్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 15మంది అభ్యర్థులతో గురువారం పట్టణంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎంపీ రంజిత్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ పామెన భీంభరత్ పాల్గొని ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అన్ని వార్డుల్లో గెలిచిరావాలని అభ్యర్థులకు పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడే ప్రతిఒక్కరికీ పదవులు వస్తాయని, అధైర్య పడాల్సిన అవసరం లేదని నాయకులు, కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. సమావేశంలో పార్టీ కో ఆర్డినేటర్ బొంతు శ్రీదేవి, శంకర్పల్లి అధ్యక్షుడు ప్రకాశ్గుప్తా, నాయకులు ఉదయ్ మోహన్రెడ్డి, వెంకట్రెడ్డి, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అనురాధను గెలిపించండి..
మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో మహేందర్రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ అభ్యర్థి అనురాధ గెలుపునకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని, పార్టీ నుంచి అన్ని రకాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.
మొయినాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. మొయినాబాద్లోని చిలుకూరు బాలాజీ దేవాలయం వద్ద గురువారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అంతకు ముందు స్వామివారిని దర్శించుకుని, పూజలు చేశారు. సాయంత్రం హిమాయత్నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ నాయకులంతా సమన్వయంతో పనిచేసి అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేయాలన్నారు. ప్రతీ ఓటరును కలిసి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహ్మారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జ్ భీంభరత్, మండల అధ్యక్షుడు మాణయ్య, నాయకులు కంజర్ల భాస్కర్, వెంకట్రెడ్డి, రవీందర్రెడ్డి, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
● 15వార్డుల్లో గెలిచి, కాంగ్రెస్ సత్తాచాటాలి
● శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి


