హస్తంలో రెబెల్స్.. గుబుల్
ఇబ్రహీంపట్నం: మున్సిపల్ పోరులో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. బరిలో ఉండే అభ్యర్థుల లెక్క తేలింది. ఆయా పార్టీల బీఫాంలను అందజేయడంతో టికెట్లు దక్కని ఆశావహులు నిరసన గళం వినిస్తున్నారు. ఇన్ని రోజులు పార్టీని నమ్ముకున్న తమకు మొండి చేయే చూపించారని అధికార పార్టీకి చెందిన నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఏకంగా పార్టీలు మారుతున్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ నుంచి 6వ వార్డు టికెట్ను ఆశించి జలమోని రవీందర్ భంగపడ్డారు. పార్టీ బీ ఫాం ఇతరులకు ఇవ్వడంతో ఆయన అగ్గిమీద గుగ్గిలమయ్యారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్కు చెందిన జమాల్పూర్ శ్యాం కొన్నేళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నా 1వ వార్డు టికెట్ ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నారు. వీరిద్దరూ వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. 3, 14 వార్డుల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. ఆయా వార్డుల్లో కాంగ్రెస్ రెబల్స్గా వీరు పోటీ చేస్తున్నారు. పలువురు కాంగ్రెస్ శ్రేణులు మాజీ ఎమ్మెల్యే కిషన్రెడి సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం గమనార్హం. ఏదిఏమైనా అధికార పార్టీకి రెబల్స్ బెడద తప్పడం లేదు.


