బత్తాయి తోటకు నిప్పు పెట్టిన టీడీపీ వర్గీయులు
అర్థవీడు: పది ఎకరాల్లో ఉన్న బత్తాయి తోట, డ్రిప్ పైపులకు టీడీపీ నేతలు నిప్పంటించి తగులబెట్టిన ఘటన మార్కాపురం జిల్లా అర్థవీడు మండలం పాపినేనిపల్లెలో గురువారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన వడ్డెముట్ల వెంకటేశ్వరరావు, గొటికే రాజేశ్వరరెడ్డి, మరో నలుగురికి చెందిన బత్తాయి తోటలో డ్రిప్ పైపులు, చెట్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు వ్యాపించి బత్తాయి తోట పక్కన ఉన్న 4 ఎకరాల జామాయిల్ తోట దగ్ధమైంది. సర్వే నంబర్ 51, 53, 54లోని 25 ఎకరాలు మాజీ ఎంపీపీ గొటికే రాజేశ్వరరెడ్డి ఆధీనంలో ఉన్నాయని టీడీపీ నేతలు కలెక్టర్, తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. అయితే ఆ 25 ఎకరాల్లో సాగులో ఉన్న రైతులు బోరు, కరెంట్ బిల్లులు, పాస్ పుస్తకాలు, రైతు భరోసా పత్రాలు విచారణకు వచ్చిన అధికారులకు అందజేశారు. ఈ భూములతో రాజేశ్వరరెడ్డికి సంబంధం లేదన్నారు. రాజకీయ ఒత్తిడితో విచారణకు వచ్చిన అధికారులు రాజేశ్వరరెడ్డి ఆధీనంలోనే భూమి ఉందని, పీఓటీ యాక్ట్ కింద ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకునేందుకు ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై రైతులు సబ్ కలెక్టర్కు అప్పీలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ వర్గానికి చెందిన వారు కక్షపూరితంగా తమకు నష్టం చేకూర్చాలని తోటలను ధ్వంసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
బత్తాయి తోటకు నిప్పు పెట్టిన టీడీపీ వర్గీయులు


