క్షణం తీరిక లేదు.. సమస్య పరిష్కరిస్తాం
ఒంగోలు టౌన్: కులాంతర వివాహం చేసుకున్న కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించినట్లు వచ్చిన ఫిర్యాదుపై ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. శుక్రవారం కొత్తపట్నం మండలం రాజుపాలెం గ్రామస్తులతో మాట్లాడి గ్రామ బహిష్కరణపై వివరాలు సేకరించారు. గ్రామంలోని అన్ని సామాజిక వర్గాల అభిప్రాయాలు తెలుసుకున్నారు. గ్రామ చావిడిలో గౌడ సామాజికవర్గానికి చెందిన ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో 14, 15 తేదీల్లో పాకల బీచ్ ఫెస్టివల్ ఉందని, మహా శివరాత్రి ఉత్సవాల బందోబస్తులో పోలీసులు తీరికలేకుండా ఉన్నారని తెలిపారు. రెండు రోజులు సమయం ఇస్తే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ.. గ్రామ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని, ఒకవేళ కుదరకపోతే సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. విచారణలో కొత్తపట్నం తహసీల్దార్ నాయబ్ రసూల్, ఎస్సై సుధాకర్, ఆర్ఐ, వీఆర్వోలు పాల్గొన్నారు.
కొత్తపట్నం మండలం రాజుపాలెంలో గ్రామ బహిష్కరణపై డీఎస్పీ, ఆర్డీఓ
రెండు రోజులు సమయం ఇవ్వాలని గ్రామస్తులను కోరిన అధికారులు


