సాక్షి, తాడేపల్లి: మావిగన్ ప్రతిపాదనతో చంద్రబాబు ప్రభుత్వంలో భయం మొదలైందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు బయట పడుతున్నాయని టెన్షన్ పడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. జర్నలిస్టులు, న్యాయవాదులపై కూడా వేధింపులు పెరిగాయి’’ అని మనోహర్రెడ్డి మండిపడ్డారు.
‘‘కోర్టులు ఎన్నిసార్లు హెచ్చరించినా పోలీసుల్లో మార్పు రావటం లేదు. ఈ అరాచకాలపై జనమే తిరగపడే రోజు వస్తోంది. పూడి శ్రీహరి, తెలంగాణ జర్నలిస్టు కేవిఆర్పై వేధింపులు అన్యాయం. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై గంటల తరపడి దాడులు జరిగినప్పుడు ఈ పోలీసులు ఏం అయ్యారు?. పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగినా ఎందుకు నిలువరింవలేదు. సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులను ఆపాలి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తున్నారు’’ అంటూ మనోహర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘మహాటీవీ వంశీ వ్యాఖ్యలపై వీడియో చేశాడని తెలంగాణ జర్నలిస్టు కేవిఆర్పై అక్రమ కేసు పెట్టారు. ఏపీ పోలీసులు అతన్ని తీవ్రంగా వేధించారు. ఇప్పుడు మళ్ళీ విజయనగరంలో కేసు పెట్టించి వేధించారు. తెలంగాణ జర్నలిస్టులు నిలదీస్తే ఏపీ పోలీసులు నీళ్లు నమిలారు. నారా లోకేష్ పదేపదే రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. ఆ రెడ్ బుక్ గురించి మాట్లాడినందుకు కేవిఆర్పై కేసు పెడతారా?. సవీంద్ర కేసులో సీబీఐ రంగంలోకి దిగి విచారణ జరిపింది. ఇలా అనేక కేసుల్లో కోర్టులు తీవ్రంగా స్పందించినా పోలీసుల్లో మార్పు రాలేదు
..పూడి శ్రీహరి జర్నలిస్టు జీవితంలో ఎప్పుడూ ఎక్కడా కేసుల్లేవు. కానీ మొదటిసారి చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టింది. జగన్కు సన్నిహితుడనే కారణంతోనే అరెస్టు చేశారు. టీడీపీ అధికార పేజీల్లో వైఎస్సార్ సీపీపై పెడుతున్న అడ్డగోలుగా పోస్టులపై ఎందుకు కేసులు పెట్టటం లేదు?. 2 వందలకు పైగా ఫిర్యాదులు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఏబీఎన్ రాధాకృష్ణ మీద 62 చోట్ల ఫిర్యాదులు ఇచ్చినా ఎందుకు కేసు నమోదు చేయలేదు?. పైగా నిరసన తెలిపిన మా పార్టీ నేతలపై అక్రమ కేసు పెట్టారు. వైఎస్ జగన్ తెచ్చిన మావిగన్ ప్రతిపాదన జనంలోకి బాగా వెళ్లింది. దీంతో డైవర్షన్ కోసం మంత్రులతో బూతులు తిట్టిస్తున్నారు. ప్రభుత్వం, పోలీసులు తమ వైఖరి మార్చుకోవాలి’’ అని మనోహర్రెడ్డి హెచ్చరించారు.


