విపక్షాలకు నో ఎంట్రీ
ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా ఆర్మూర్ పోలీసులు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించిన తీరు సోమవారం వివాదాస్పదమైంది. ఆర్మూర్ ఏ సీపీ వెంకటేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు టీపీసీసీ అధికార ప్రతినిధి ఏబీ శ్రీనివాస్(చిన్న), కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్రెడ్డిలు కార్లలో రాగా వారిని లోపలికి అనుమతించారు. దీంతో బీజేపీ రైతు నాయకుడు నూతుల శ్రీనివాస్రెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి పొల్కొం వేణు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు అభ్యంతరం తెలుపుతూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎన్నిక సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను లోనికి అనుమతించి బీజేపీ నాయకులను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. దీంతో పోలీసులు ఇరువర్గాల వారిని బయటకు పంపించడంతో వివాదం సద్దుమణిగింది.


