బెంగళూరులోని ఒక అద్దె ఇంట్లో 34 ఏళ్ల మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపింది. రక్తపు మడుగులో ఆమె నగ్న మృతదేహం లభ్యం కావడం మరింత ఆందోళన రేపింది. ఫ్లాట్ నుండి దుర్వాసన వస్తుండటంతో ఇరుగుపొరుగువారు అధికారులకు సమాచారం అందించారు. దీంతో సోమవారం నాడు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతురాలిని జార్ఖండ్లోని ధన్బాద్ జిల్లాకు చెందిన పూజా దత్తాగా గుర్తించారు. ఆమె బెంగళూరులోని 'బాష్' (Bosch) కంపెనీలో పనిచేస్తోంది. గత మూడేళ్లుగా ఆమె బెంగళూరులో ఒంటరిగా నివసిస్తోంది.
ఏం జరిగింది?
పోలీసుల సమాచారం ప్రకారం సోమవారం నాడు ఆమె నివసిస్తున్న ఫ్లాట్ నుండి తీవ్రమైన దుర్వాసన రావడంతో పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులొచ్చి తలుపులు పగులగొట్టి చూడగా, పూజా దత్తా మృతదేహం నగ్నంగా, రక్తపు మడుగులో పడి ఉంది. మృతదేహం అప్పటికే కుళ్ళిపోయిన స్థితిలో ఉంది. ఫోరెన్సిక్ నిపుణుల అంచనా ప్రకారం, మృతదేహం లభ్యం కావడానికి రెండు లేదా మూడు రోజుల ముందే ఆ మహిళ మృతిచెంది ఉంటుందని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: బండిపై 6 గురు బుడ్డోళ్లు, పేరెంట్స్ను అరెస్ట్ చేయాలి!
గత మూడేళ్లుగా ఆమె తన ఫ్లాట్లో అద్దెకు నివసిస్తోందని, ఏప్రిల్ 23న కిరాణా సామాగ్రి కొనడానికి వెళ్లినప్పుడు ఆమె చివరిసారిగా కనిపించిందని ఇంటి యజమాని తెలిపారు. అయితే, గదిలో చెల్లా చెదురుగా పడి ఉన్న కాగితాలు తప్ప ఘటనా స్థలంలో ఎటువంటి ఆత్మహత్య లేఖ దొరకలేదు. అయితే తలుపు లోపలి నుండి వేసి ఉండటంతో, ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ, పోలీసులు దీనిని "అనుమానాస్పద మృతి"గా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు పోస్టుమార్టం నివేదిక తర్వాత తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: మండే ఎండల్లో ఏసీలు పేలే ప్రమాదం : ఈ జాగ్రత్తలు మస్ట్


