సాక్షి, ముంబై: అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన వ్యక్తి అనూహ్యంగా సెక్యూరిటీ గార్డులపై దాడి చేసిన ఘటన కలకలం రేపింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. పోలీసులు నిందితుడిని మూడు గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు. అయితే దాడి చేసిన కారణం ఏంటి అనేదానిపై దర్యాప్తు జరుగుతోంది.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం 19 ఏళ్ల పాటు అమెరికాలో ఉండి జైబ్ అన్సారీ (31) అనే వ్యక్తి 2019లో భారతదేశానికి తిరిగి వచ్చాడు. కారణాలపై స్పష్టత లేనప్పటికీ, ముంబై సమీపంలోని మీరా రోడ్లో ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై కత్తితో దాడి చేయడం కలకలం రేపింది. ఒక మతపరమైన శ్లోకాన్ని పఠించడానికి నిరాకరించినందుకు ఇద్దరు గార్డులను కత్తితో పొడిచినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో గాయపడిన ఇద్దరు గార్డులు రాజ్కుమార్ మిశ్రా, సుబ్రతో సేన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మీరా రోడ్ ఈస్ట్లోని నయా నగర్లో గల 'అస్మిత గ్రాండ్ మ్యాన్షన్' కన్స్ట్రక్షన్ సైట్ వద్ద ఈ ఘటన జరిగింది. నిందితుడిని అరెస్ట్ చేశారు.
నిందితుడు ఒక మతపరమైన శ్లోకాన్ని పఠించమని గార్డులను కోరాడని, వారు నిరాకరించడంతోనే దాడి చేశాడని కొన్ని హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి. భజరంగ్ దళ్ వంటి సంస్థలు ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఈ కేసును మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ATS) థానే విభాగానికి బదిలీ చేశారు. అసలు దాడికి గల కారణంపై లోతైన దర్యాప్తు జరుపుతున్నామని పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనతో మీరా రోడ్ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. పుకార్లు వ్యాపించకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. అలాగే ఈ ఆరోపణల వెనుక ఉన్న నిజాన్ని నిందితుడి నేపథ్యాన్ని ATS అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఇదీ చదవండి: వినాశకాలే విపరీత బుద్ధి : వీసీ సజ్జనార్ చీవాట్లు


