మహిళా అధికారులతో సిట్‌ ఏర్పాటు చేయండి  | Supreme Court Orders SIT Probe In Ghaziabad 4-Year-Old molestation case | Sakshi
Sakshi News home page

మహిళా అధికారులతో సిట్‌ ఏర్పాటు చేయండి 

Apr 25 2026 5:10 AM | Updated on Apr 25 2026 5:10 AM

Supreme Court Orders SIT Probe In Ghaziabad 4-Year-Old molestation case

 రెండు వారాల్లోగా దర్యాప్తు పూర్తి కావాలి 

చిన్నారి హత్యాచారంపై సుప్రీం ఆదేశాలు  

ఘాజియాబాద్‌ పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో గత నెలలో నాలుగేళ్ల చిన్నారి అత్యాచారం, హత్య ఘటనపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. కేసు దర్యాప్తునకు పూర్తిగా మహిళా అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేయాలని యూపీ డీజీపీని ఆదేశించింది. గడువులోగా విచారణను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ దారుణంపై దర్యాప్తు చేయడంలో ఘాజియాబాద్‌ పోలీసులు చూపిన అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

శుక్రవారం లేదా శనివారం ఉదయం 11 గంటల్లోగా సిట్‌ ఏర్పాటుపై నోటిఫికేషన్‌ జారీ చేయాలని డీజీపీకి సుప్రీంకోర్టు నిర్దేశించింది. మార్చి 16వ తేదీన ఓ కామాంధుడు పొరుగింట్లో ఉండే నాలుగేళ్ల చిన్నారికి చాక్లెట్ల ఆశచూపి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. రోజువారీ కూలీ అయిన బాలిక తండ్రి ఆమె జాడ కోసం వెతగ్గా రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో ప్రాణాపాయ స్థితిలో పడి ఉంది.

 ఆమెకు చికిత్స అందించేందుకు స్థానికంగా ఉన్న రెండు ఆస్పత్రుల నిర్వాహకులు నిరాకరించారు. చివరికి ఘాజియాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే చిన్నారి ప్రాణాలు విడిచింది. సిట్‌ లేదా సీబీఐతో ఈ దారుణంపై దర్యాప్తు జరిపించాలని బాధితురాలి తండ్రి వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ సారథ్యంలోని ధర్మాసనం చిన్నారి మృతికి దారితీసిన ఘటనల క్రమంపై విస్మయం వ్యక్తం చేసింది. సిట్‌ దర్యాప్తునకు ఆదేశించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement