టోక్యో: సరిగ్గా వారం రోజుల క్రితం సంభవించిన భారీ భూకంపం తాలూకు భయం నుండి జపాన్ ప్రజలు ఇంకా తేరుకోకముందే, ఆ దేశాన్ని ప్రకృతి మరోసారి వణికించింది. సోమవారం(నేడు) తెల్లవారుజామున ఉత్తర జపాన్ను భారీ తీవ్రతతో కూడిన భూకంపం కుదిపేసింది. అయితే, అదృష్టవశాత్తూ ప్రస్తుతానికి ఎలాంటి సునామీ హెచ్చరికలు లేకపోవడంతో ప్రజలు, ప్రభుత్వ అధికారులు తాత్కాలికంగా ఊపిరి పీల్చుకున్నారు.
本日5時24分頃、北海道十勝地方南部を震源とする地震が発生し、北海道浦幌町で最大震度5強の強い揺れを観測しました。
津波の心配はありません。…— 高市早苗 (@takaichi_sanae) April 26, 2026
భూకంప తీవ్రత ఎంతంటే?
జపాన్ వాతావరణ శాఖ అందించిన తాజా అధికారిక వివరాల ప్రకారం ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. జపాన్కు ఉత్తరాన ఉన్న ప్రధాన దీవి అయిన హక్కైడోలోని చిన్న పట్టణమైన సరబెట్సు కు పశ్చిమంగా 18 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. దీని లోతు భూగర్భంలో సుమారు 81 కిలోమీటర్లు ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS)తెలిపింది. ఈ ప్రకంపనల ధాటికి పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.
సునామీ ముప్పు ఉందా? నష్టం ఏమైనా జరిగిందా?
ఈ హఠాత్పరిణామంతో సముద్ర తీరప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురైనప్పటికీ, అధికారులు వారికి ఊరటనిచ్చే వార్త చెప్పారు. ఈ తాజా భూకంపం కారణంగా ఎలాంటి సునామీ వచ్చే అవకాశం లేదని, ఎలాంటి అడ్వైజరీ జారీ చేయలేదని జపాన్ జాతీయ వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం కానీ, భవనాలు కూలిపోయి ఆస్తి నష్టం జరిగినట్లు కానీ ఎటువంటి నివేదికలు అందలేదు. అయినప్పటికీ అత్యవసర సహాయక బృందాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నాయి.
వారం క్రితమే వణికిన జపాన్
వారం రోజుల క్రితమే జపాన్లో ఏకంగా 7.7 తీవ్రతతో ఒక అతిపెద్ద భూకంపం సంభవించి దేశాన్ని అతలాకుతలం చేసింది. ఆ తీవ్ర పరిణామం తరువాత, ఈశాన్య తీరప్రాంతంలో భవిష్యత్తులో ‘మెగా భూకంపం’ వచ్చే ప్రమాదం స్వల్పంగా పెరిగిందని జపాన్ ఉన్నతాధికారులు సలహా హెచ్చరికలు జారీ చేశారు. ఆ ఘటన తాలూకు పీడకలల నుండి ప్రజలు బయటపడక ముందే తాజాగా ఈ 6.2 తీవ్రతతో ప్రకంపనలు రావడం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. వరుసగా వస్తున్న ఈ ప్రకృతి విపత్తుల కారణంగా జపాన్ ప్రభుత్వం ప్రస్తుతం హై అలర్ట్లో ఉంది.
ఇది కూడా చదవండి: బెంగాల్ కోటలో సెలబ్రిటీలకు షాక్


