ఈసీ నిబంధనల ప్రకారమే ఎన్నిక
మెదక్ కలెక్టరేట్: ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారమే మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పరోక్ష ఎన్నిక నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. ఈ నెల 16న మెదక్ మున్సిపాలిటీలో నిర్వహించనున్న ఎన్నిక ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సమావేశం చెల్లుబాటు కావాలంటే మొత్తం అర్హత గల సభ్యులలో కనీసం 50 శాతం మంది తప్పనిసరిగా హాజరు ఉండాలన్నారు. ప్రత్యక్షంగా ఎన్నికై న కౌన్సిలర్లకు అదే రోజు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చైర్పర్సన్, అనంతరం వైస్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహిస్తామన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థుల అధికార గుర్తింపు పత్రాలను ఆదివారం ఉదయం 10 గంటలలోగా సమర్పించాలన్నారు. గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు.
కలెక్టర్ రాహుల్రాజ్


