అత్యవసరం.. అధ్వానం
● మారని ఎంజీఎం ఏఎంసీ తీరు
ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రిలో అత్యవసర విభాగాల పని తీరు పూర్తిగా అధ్వానంగా మారుతోంది. రెండు నెలల క్రితం డీఎంఈ ఆస్పత్రిని పరిశీలించారు. అయినప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు. దానికి తోడు రోజురోజుకూ సేవలు మరింత అధ్వానంగా మారుతున్నాయి. ఆస్పత్రిలోని క్యాజువాలిటీ, ఏఎంఎసీ, ఐఎంసీ విభాగాల్లో నిత్యం పడకల్లో ఒక్కరు లేదా ఇద్దరు పేషెంట్లను ఉంచుతున్నారు. కొన్ని సందర్భాల్లో స్ట్రెచర్లపై, వీల్ చైర్లపైనే వైద్యం అందిస్తున్నారు. ఇలా వైద్యం పొందే వారు జ్వరం, స్వల్ప అస్వస్థతలో వచ్చే వారు కాదు. ప్రాణపాయస్థితిలో ఉన్న వారే ఎక్కువ మంది. పరిస్థితిని బట్టి చూస్తే ఎంజీఎం ఆస్పత్రిలో ఏ మేర వైద్యసేవలు అందుతున్నాయో అర్థమవుతోంది. ఈ విషయాన్ని రోగుల సహాయకులు పరిపాలనాధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఆ సమయాల్లో విధులు నిర్వర్తించాల్సిన డీఎంఓ, డీఎస్ఓఓలు కానరావడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 24 గంటలు పర్యవేక్షించాల్సిన ఆర్ఎంఓలు చాంబర్లు దాటి వార్డులకు రావట్లేదని వారంతా వాపోతున్నారు. అధికారులు చివరకు ఏం చెప్పాల్లో తెలియక ‘ఎంజీఎం ఆస్పత్రికి రోగుల తాకిడి ఎక్కువైంది. మేం చేసేదేమీ లేదు. పెద్దాస్పత్రికి పోయినాక పరిస్థితి మారుతుంది’ అని చేతులు దులుపుకుంటున్నారు.


