దేశంలోని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీ) కార్యకలాపాలను మరింత పారదర్శకంగా, పటిష్టంగా మార్చే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక అడుగు వేసింది. ఎన్బీఎఫ్సీల శాఖల ప్రారంభం, విస్తరణ, మూసివేతపై సవరించిన సరికొత్త నిబంధనలను ఇటీవల జారీ చేసింది. ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు - బ్రాంచ్ ఆథరైజేషన్) ఆదేశాలు, 2025’ పేరుతో వెలువడిన ఈ మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకి వచ్చాయి.
డిపాజిట్లు స్వీకరించే ఎన్బీఎఫ్సీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్బీఐ చట్టం-1934, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ చట్టం-1987 లోని అధికారాలను ఉపయోగించి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర బ్యాంకు వెల్లడించింది.
శాఖల విస్తరణకు షరతులు ఇవే..
కొత్త నిబంధనల ప్రకారం, ఎన్బీఎఫ్సీల ఆర్థిక స్తోమతను బట్టి వాటి విస్తరణ పరిధిని ఆర్బీఐ నిర్ణయించింది.
రూ.50 కోట్ల వరకు నికర యాజమాన్య నిధులు (ఎన్ఓఎఫ్) కలిగి ఉండి, తక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్న డిపాజిట్ తీసుకునే ఎన్బీఎఫ్సీలు తమ రిజిస్టర్డ్ కార్యాలయం ఉన్న రాష్ట్రంలో మాత్రమే శాఖలను తెరవాలి.
రూ.50 కోట్లకు పైగా నికర నిధులు ఉండి ‘AA’ లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్న సంస్థలు దేశవ్యాప్తంగా తమ కార్యకలాపాలను విస్తరించుకోవడానికి అనుమతి ఉంటుంది.
‘ప్రవాహ్’ పోర్టల్ ద్వారా దరఖాస్తు
శాఖల విస్తరణ కోసం ఎన్బీఎఫ్సీలు ఆర్బీఐకి ముందస్తు సమాచారం అందించాలి. ఇందుకోసం ప్రవాహ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసిన 30 రోజులలోపు ఆర్బీఐ నుంచి ఎటువంటి అభ్యంతరాలు రాకపోతే, ఆయా సంస్థలు తమ విస్తరణ ప్రణాళికలతో ముందుకు వెళ్లవచ్చు. అయితే, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు దేశంలో శాఖలు తెరిచే ముందు నేషనల్ హౌసింగ్ బ్యాంక్కు సమాచారం ఇవ్వాలని, విదేశాల్లో శాఖలు తెరవడానికి వీలు లేదని ఆర్బీఐ పేర్కొంది.
గోల్డ్ లోన్ సంస్థలపై ప్రత్యేక నిఘా
బంగారు ఆభరణాల తాకట్టుపై రుణాలు ఇచ్చే ఎన్బీఎఫ్సీ-ఐసీసీలపై ఆర్బీఐ నిబంధనలను కఠినతరం చేసింది.
1,000 కంటే ఎక్కువ శాఖలను తెరవాలనుకునే గోల్డ్ లోన్ కంపెనీలు తప్పనిసరిగా ఆర్బీఐ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి.
తాకట్టు పెట్టిన బంగారం భద్రత కోసం తగినంత నిల్వ సామర్థ్యం(స్ట్రాంగ్ రూమ్స్), పటిష్టమైన భద్రతా సౌకర్యాలు ఉన్నాయని నిర్ధారించుకోవాలి.
శాఖల మూసివేతకు మూడు నెలల నోటీసు
ఏదైనా కారణంతో శాఖలను మూసివేయాలనుకుంటే వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కనీసం మూడు నెలల ముందుగా స్థానిక వార్తాపత్రికలలో పబ్లిక్ నోటీసు ఇవ్వాలి. ఈ సమాచారాన్ని ఆర్బీఐ లేదా ఎన్హెచ్బీకి తెలియజేయడం తప్పనిసరి. అలాగే, విదేశాల్లో రిప్రెజెంటేటివ్ కార్యాలయాలను తెరవడానికి ఆర్బీఐ అనుమతి అవసరం. ఇవి కేవలం పరిశోధన, సమన్వయ కార్యకలాపాలకు మాత్రమే పరిమితం కావాలని, ఎటువంటి నిధుల లావాదేవీలు జరపకూడదని నిబంధనల్లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: డిమాండ్ భళా.. నిర్మాణాలు డీలా!


