రివులిస్‌తో జైన్‌ ఇరిగేషన్‌ జత

Jain Irrigation to merge global business with Rivulis of Temasek - Sakshi

గ్లోబల్‌ ఇరిగేషన్‌ బిజినెస్‌ విలీనం

నగదు, స్టాక్‌ రూపేణా డీల్‌

న్యూఢిల్లీ: వ్యవసాయ రంగ సూక్ష్మ నీటి పరికరాల కంపెనీ జైన్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌ రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇందుకు అనుగుణంగా టెమాసెక్‌ కంపెనీ రివులిస్‌ పీటీఈతో గ్లోబల్‌ ఇరిగేషన్‌ బిజినెస్‌ను విలీనం చేసేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. గ్లోబల్‌ బిజినెస్‌ విలువ రూ. 4,200 కోట్లుకాగా.. నగదు, స్టాక్‌ రూపేణా కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా లభించే నిధులతో కన్సాలిడేటెడ్‌ రుణ భారాన్ని రూ. 2,700 కోట్లు(45 శాతం వరకూ) తగ్గించుకోనుంది. మరో రూ. 200 కోట్లు మాతృ సంస్థకు లభించనున్నట్లు జైన్‌ ఇరిగేషన్‌ ఎండీ అనిల్‌ జైన్‌ వెల్లడించారు. విలీన సంస్థలో జైన్‌ ఇంటర్నేషనల్‌ 22 శాతం వాటాను పొందనుండగా.. టెమాసెక్‌ హోల్డింగ్‌ మిగిలిన 78 శాతం వాటాను సొంతం చేసుకోనుంది.  

రెండో పెద్ద కంపెనీ
తాజా విలీనం తదుపరి సంయుక్త సంస్థ 75 కోట్ల డాలర్ల(రూ. 5,850 కోట్లు) ఆదాయంతో రెండో పెద్ద గ్లోబల్‌ కంపెనీగా ఆవిర్భవించనున్నట్లు జైన్‌ ఇరిగేషన్‌ పేర్కొంది. ప్రస్తుతం రివులిస్‌ ఆదాయం 40 కోట్ల డాలర్లుకాగా.. జైన్‌ ఇరిగేషన్‌ గ్లోబల్‌ బిజినెస్‌ 35 కోట్ల డాలర్ల అమ్మకా లు సాధించింది. విలీనానికి వీలుగా సొంత అను బంధ సంస్థ జైన్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడింగ్‌ ద్వారా రివులిస్‌ పీటీఈతో జైన్‌ ఇరిగేషన్‌ చేతులు కలిపింది. తద్వారా 22.5 కోట్ల డాలర్ల పునర్వ్యవస్థీకరించిన విదేశీ బాండ్లతోపాటు, పూర్తి రుణ భారంలో 45 శాతంవరకూ తిరిగి చెల్లించనున్నట్లు జైన్‌ ఇరిగేషన్‌ తెలియజేసింది. అంతేకాకుండా బాండ్‌ హోల్డర్లు, ఐఐబీ రుణదాతలకిచ్చి న రూ. 2,275 కోట్ల కార్పొరేట్‌ గ్యారంటీని సై తం విడిపించుకోనున్నట్లు వెల్లడించింది. 2022 మార్చి31కల్లా కంపెనీ కన్సాలిడేటెడ్‌ రుణ భారం రూ. 6,000 కోట్లుగా నమోదైంది. దీనిలో దేశీ బిజినెస్‌ వాటా రూ. 3,300 కోట్లు. ఈ కాలంలో మొత్తం ఆదాయం రూ. 7,119 కోట్లను అధిగమించగా.. రూ. 358 కోట్ల నికర లాభం ఆర్జించింది.

ఈ వార్తల నేపథ్యంలో జైన్‌ ఇరిగేషన్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకి రూ. 37.5 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top