ఈ రోజుల్లో ఇల్లు కొనాలన్నా?, భూములు కొనాలన్నా?, కారు కొనాలన్నా?, ఆఖరికి బైక్ కొనాలన్నా కూడా చాలామంది బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటారు. అయితే ఇక్కడ చాలామంది మనసులో మెదిలే ప్రశ్న.. ఒక వ్యక్తి ఎన్ని లోన్స్ తీసుకోవచ్చు?, దీనికి ఏమైనా పరిమితులు ఉన్నాయా? అని. దీనికి సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం.. ఒక వ్యక్తి ఇన్నిసార్లు మాత్రమే లోన్ తీసుకోవాలి? అనే విషయంపై ఎలాంటి నిబంధన లేదు. కాబట్టి ఒకటి, రెండు లేదా అంతకంటే ఎక్కువ లోన్స్ తీసుకోవచ్చు. అయితే లోన్ ఇవ్వాలా?, వద్దా అనేది.. సదరు బ్యాంక్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
మీకు లోన్ ఇచ్చేముందు.. ఏ బ్యాంక్ అయినా ముందుగా మీ డీఐఆర్ (Debt to Income Ratio) చెక్ చేస్తుంది. అంటే మీకు నెలకు వచ్చే ఆదాయం ఎంత?, అప్పటికే మీరు ఏదైనా ఈఎంఐ చెల్లిస్తున్నారా? అనే విషయాన్ని బ్యాంక్ గమనిస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తికి వచ్చే ఆదాయంలో 35 శాతం ఈఎంఐ కోసం కేటాయించవచ్చు.
ఉదాహరణకు ఒక వ్యక్తికి నెలకు రూ. లక్ష జీతం అనుకుంటే.. అందులో రూ.35000 ఈఎంఐ కోసం కేటాయించుకోవచ్చు. అంతకంటే ఎక్కువ ఈఎంఐ కోసం కేటాయిస్తే ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే బ్యాంక్ లోన్ ఇవ్వడానికి నిరాకరించే అవకాశం ఉంటుంది. ఒకవేళా మీరు చెల్లించే లోన్ ఈఎంఐ నెలకు రూ.10వేలు మాత్రమే అయితే.. అలాంటి సందర్భంలో మీకు మరో లోన్ సులభంగా వస్తుంది.
ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల్లో మార్పు: ఏడు రోజుల్లో ఇలా..
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే?.. లోన్ ఇచ్చే బ్యాంక్ మీ సిబిల్ స్కోర్ కూడా చూస్తుంది. గతంలో ఎప్పుడైనా లోన్ తీసుకున్నారా?, దాన్ని చెల్లించడంలో ఏదైనా జాప్యం జరిగిందా? అనే విషయాలను కూడా బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు గమనిస్తాయి.
ఒక వ్యక్తి ఒకటికంటే ఎక్కువ లోన్స్ తీసుకోకూడదనే రూల్ ఎక్కడా లేదు. కానీ ఎక్కువ లోన్స్ తీసుకుంటే మీ ఆర్ధిక పరిస్థితి కష్టమవుతుంది. మీరు తీసుకునే లోన్ అప్పటికి ఉపశమనం కలిగించవచ్చు. భవిష్యత్తులో భారమవుతుంది. కాబట్టి ఒకటి కంటే ఎక్కువ లోన్స్ తీసుకునేవారు తప్పకుండా.. ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ''అప్పు తప్పు కాదు.. కానీ అప్పు ఎక్కువైతే ముప్పు'' తెస్తుంది.


