నెల్లూరు : ‘ పవన్ సార్.. మేం అధికారంలోకి వస్తే రోడ్లు వేయిస్తామని అప్పుడు హామీ ఇచ్చారు కదా.. ఇవేనా రోడ్లు’ అంటూ పశ్నించాడు కూటమి కార్యకర్త. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సైదాపురం కలిచేడు రోడ్డు అధ్వాన్నంగా ఉందని నడిరోడ్డుపైనే మంచం వేసుకుని నిరసన తెలిపాడు కూటమికి చెందిన కార్యకర్త. నెల్లూరు-గూడూరులను కలిపే ఈ రోడ్లపై వెళుతుంటే తమ ప్రాణాలు పోతున్నాయని, ఎటు చూసినా గుంతలు, గోతులతో చాలా అథ్వాన్నంగా ఉందని ఫైర్ అయ్యాడు.
కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రోడ్లు వేయిస్తామన్నారు కదా.. ఇవే నా మీరు వేసిన రోడ్లు అంటూ నడిరోడ్డుపై మంచంపై కూర్చొని మరీ నిరసన తెలిపాడు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వంలోని పెద్దలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను ఏకిపారేశాడు.
‘అధికారంలోకి వస్తే రోడ్లు వేయిస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్. ఇప్పటివరకూ వేయలేదు. నేను ఆరు నెలల క్రితం చెప్పాను. అయినా పట్టించుకోలేదు. మళ్లీ ఈ విషయాన్ని ఇలా చెబుతున్నా. మా కడుపులు మండిపోతున్నాయ్. గతంలో టెంట్లు వేసుకుని రోడ్లు వేయమని అడిగాం. ఇప్పుడు ఇలా నులక మంచం వేసుకుని నిరసన తెలపాల్సి వచ్చింది.
పుట్టిన రోజు వేడుకల్లో బిజిగా ఉన్న చంద్రబాబు నాయుడు.. ఇక్కడ(ఈ రోడ్లపై) పుట్టినరోజు చేసుకుని చూడండి. మా బాధ ఏంటో అర్ధమవుతుంది. నేను ఎమ్మెల్యేగా పోటీ చేశానండి.. కడుపు మండిపోతుంది. నేను అడిగేది ఒక్కటే అబ్బా.. మీరు వారం రోజుల్లో రోడ్లు వేయిస్తారా.. లేక నిధులు పోగు చేసుకుని మేమే రోడ్డు వేసుకోవాలా? చెప్పండి’ అంటూ సూటిగా ప్రశ్నించాడు.



