కందలపాడులో గ్రావెల్ తవ్వకాలు జరిపిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న కాకాణి, తదితరులు
పేదల భూముల్లో తవ్వకాలతో వారి కడుపు కొట్టడం దుర్మార్గం
పేదలను కేసుల పేరుతో సీఐ బెదిరించడం దారుణం
కందలపాడులో గ్రావెల్ అక్రమ తవ్వకాలపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి కాకాణి
వెంకటాచలం: అక్రమ సంపాదన కోసం పేదల భూముల్లో దౌర్జన్యంగా గ్రావెల్ అక్రమంగా తవ్వుతూ వారి కడుపు కొట్టడం దుర్మార్గమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కందలపాడులో అక్రమంగా గ్రావెల్ తవ్వుతున్న ప్రదేశాన్ని గ్రామస్తులు, వివిధ పార్టీల నాయకులతో కలిసి కాకాణి శుక్రవారం పరిశీలించారు. గ్రామస్తులు, మహిళలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించి, కన్నీరు పెట్టుకున్నారు.
తమ భూముల్లో దౌర్జన్యంగా గ్రావెల్ తవ్వేస్తున్నారని, ఇదేమని ప్రశ్నిస్తే సీఐ సుబ్బారావు తమపైనే కేసులు పెట్టి జైల్లో పెడతామని బెదిరిస్తున్నారని వాపోయారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న నిమ్మ చెట్లను సైతం తవ్వేశారని విలపించారు. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో సహజ వనరుల దోపిడీకి ఇది ఒక ఉదాహరణ అని చెప్పారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రోద్బలంతోనే గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని అన్నారు. దశాబ్దాలుగా నిరుపేదలు సాగు చేసుకునే ఈ భూముల్లో గతంలోనే కొందరికి డీ ఫారం పట్టాలు కూడా ఇచ్చారని, 2007లోనే విద్యుత్ సౌకర్యం కల్పించారని చెప్పారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో 2023లో సర్వే నంబరు 57లోని 240 ఎకరాల్లో 174.67 ఎకరాల భూమిని అనా«దీనంగా మారుస్తూ 140 మంది పేదలకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక సోమిరెడ్డి కనుసన్నల్లో గ్రావెల్ తవ్వేస్తున్నారని «విమర్శించారు. అడ్డుకున్న మహిళలపై కూడా కేసులు పెడతామని సీఐ సుబ్బారావు బెదిరించడం చూస్తే ఎంత అవినీతిలో కూరుకుపోయారో అర్థమవుతుందన్నారు. జిల్లాలో కలెక్టర్, ఆర్డీవో, ఎస్పీ వంటి ఉన్నతాధికారులు ఉన్నారా అనే అనుమానం కలుగుతోందన్నారు. మైనింగ్ శాఖ డీడీ నిద్రలేస్తే అవినీతిలో మునిగి తేలుతున్నాడని ఆరోపించారు.
అసలు జిల్లాలో అధికార యంత్రాంగం పనిచేస్తోందా అని నిలదీశారు. గ్రావెల్ తరలిస్తున్న లారీల నంబర్లు నమోదు చేస్తున్నామని, కలెక్టర్తో మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకునేలా చేస్తామన్నారు. టీడీపీ, బీజేపీ సానుభూతిపరులు కూడా ఈ అక్రమ తవ్వకాల వల్ల నష్టపోయి తమతో కలిసి పోరాటానికి వచ్చారని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, మండల వైస్ ఎంపీపీలు కనుపూరు కోదండరామిరెడ్డి, పచ్చబట్ల మస్తానయ్య, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కొణిదెన మోహన్నాయుడు, ఎంపీటీసీ వేమారెడ్డి రఘునందన్ రెడ్డి పాల్గొన్నారు.


