గోల్లిపుట్టులో తాగునీటి కష్టాలపై ఆందోళన
ముంచంగిపుట్టు: మండలంలోని బరడ పంచాయతీ, గోల్లిపుట్టు గ్రామంలో తాగునీటి కష్టాలను తీర్చాలని కోరుతూ స్థానిక గిరిజనులు ఆందోళనకు దిగారు. గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న నీటి ఇబ్బందులను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, శుక్రవారం గ్రామస్తులు పాడైన తాగునీటి పథకం వద్ద ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాగునీటి కోసం గ్రామ మహిళలు సుమారు రెండు కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లాల్సి వస్తోందన్నారు. గతంలో నవ నిర్మాణ సమితి ద్వారా ఏర్పాటు చేసిన నీటి పథకం ప్రస్తుతం నిరుపయోగంగా మారిందన్నారు. ప్రత్యామ్నాయం లేక గ్రామస్తులు ఊట గెడ్డలు, పారు గెడ్డల నీటినే తాగునీటిగా వాడుతున్నామన్నారు. దీనివల్ల అనారోగ్య బారిన పడే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వంతాల జగన్నాథం, వంతాల రాజు, వంతాల రామన్న, కిల్లో సోమనాథ్ మాట్లాడుతూ.. గ్రామంలోని 20 కుటుంబాలకు చెందిన 140 మంది జనాభా నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తక్షణమే స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని, లేనిపక్షంలో మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు


