ఆరు నెలలుగా సెలవుల్లోనే..
రోలుగుంట: మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సుమారు ఆరు నెలలుగా ఇద్దరు ఉద్యోగులు సెలవుల్లో ఉండడంతో సేవలకు అంతరాయం కలుగుతోంది. పలు పనులపై వచ్చే ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. 2024లో సీనియర్ అసిస్టెంట్ పి.శ్రీనివాసరావు వేరే మండలం నుంచి బదిలీపై వచ్చి విధుల్లో చేరారు. కొన్ని నెలల పాటు విధులు నిర్వహించిన ఆయన అనారోగ్యం కారణంతో సెలవు పెట్టేశారు. మరో జూనియర్ అిసిస్టెంట్ కె.వి.ఎస్.ఎన్.ఈశ్వరరావు గతేడాది జూలైలో బదిలీ కావడంతో ఆయన స్థానంలో గతేడాది సెప్టెంబర్లో ఎస్.వి.ఎస్.చలపతి వచ్చారు. వారం రోజులు విధులు నిర్వహించి అనంతరం సెలవు పెట్టేశారు. ఇప్పటి వరకూ వారు విధుల్లో చేరక, వేరొకరు రాక వారి కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో మిగతా సిబ్బందిపై పని భారం పడుతోంది. దీనిపై ఎంపీడీవో వి.ఎస్.నాగేశ్వరరావును ‘సాక్షి’వివరణ కోరగా ఇద్దరు ఉద్యోగులూ సెలవుల్లో ఉన్నారని, విధుల ఆటంకం గురించి సీఈవో కార్యాలయంలో నివేదించామన్నారు. దీనికి స్పందించిన అధికారులు సీనియర్ అసిస్టెంట్ సెలవు పెట్టి ఆరు నెలలు దాటడంతో అతని స్థానంలో నక్కపల్లి మండలం గొడిచెర్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో జూనియర్ అసిస్టెంటుగా పని చేస్తున్న వై.గోపాలకృష్ణకు సీనియర్ అసిస్టెంటుగా పదోన్నతి కల్పిస్తూ ఇక్కడికి బదిలీ చేశారని, ఆయన జాయిన్ కావాల్సి ఉందన్నారు. జూనియర్ అసిస్టెంట్ సెలవులోనే ఉన్నారని, విధుల్లో చేరాల్సి ఉందని వివరించారు.


