దద్దుగులలో రెండు పూరిళ్లు దగ్ధం
నాతవరం: మండలంలో సరుగుడు పంచాయతీ శివారు దద్దుగుల గ్రామంలో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు పూరిళ్లు కాలిబూడిదయ్యాయి. ఎప్పుడు మాదిరిగానే మధ్యాహ్నం భోజనం చేసి పోడు వ్యవసాయం పనులు నిమిత్తం గిరిజనులు వెళ్లిపోయారు. గ్యాస్ స్టౌ నుంచి మంటలు వ్యాపించి తాటాకులకు అంటుకుని ఎగసి పడ్డాయి. రెండు తాటాకు ఇళ్లతో పాటు పక్కనే ఉన్న గొర్రెల షెడ్లు కూడా పూర్తిగా కాలిపోయాయి. ఇళ్లలో ఎవరు లేని సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో నిత్యావసర సరకులు, దుస్తులు, పాసు పుస్తకాలు, ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోవడంతో బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. స్థానిక ప్రజాప్రతినిధుల సమాచారం మేరకు నాతవరం ఎస్ఐ వై.తారకేశ్వరరావు రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ స్టౌను ఎస్ఐ పరిశీలించారు. అగ్ని ప్రమాదంలో గొల్లపల్లి ఆనందరావు, గొల్లపల్లి దేముడు తాటాకు ఇళ్లు, గొల్లపల్లి సోమరాజు గొల్లపల్లి ఉబయ్య, లోచల పెదరాజుబాబుకు చెందిన గొర్రెల పాకలు పూర్తిగా కాలిపోయాయని అధికారులు తెలిపారు. సుమారు రూ.4 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని నాతవరం ఎస్ఐ, రెవెన్యూ సిబ్బంది తెలిపారు. బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామన్నారు.
దద్దుగులలో రెండు పూరిళ్లు దగ్ధం


