స్పీకర్‌ నుంచి వైఎస్సార్‌ సీపీ ఎంపీలకు పిలుపు

YSRCP MPs Gets Call From Speaker On Resignations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవులకు రాజీనామాలు సమర్పించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలకు  లోక్‌ సభ స్పీకర్‌ కార్యాలయం నుంచి పిలుపువచ్చింది. ఈ నెల 29న లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను స్పీకర్‌ కార్యాలయంలో కలవనున్నట్లు హోదా కోసం రాజీనామా చేసిన ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. స్పీకర్‌ వైఎస్సార్‌ సీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదిస్తారని తెలిపారు. రాజీనామా చేసిన ఎంపీలు అందరూ తిరిగి ప్రజల్లోకి వెళ్లి చిత్తశుద్ధిని నిరూపించుకుంటారని పేర్కొన్నారు. ఉప ఎన్నికలు వస్తే గెలిచి తీరుతామని మిథున్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

కాగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసిన విషయం విదితమే.  పార్లమెంట్‌ నివరధిక వాయిదా పడిన అనంతరం ఎంపీలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, అవినాశ్‌ రెడ్డి, మిథున్‌ రెడ్డిలు స్పీకర్‌ను కలుసుకుని, రాజీనామా పత్రాలను సమర్పించారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో రూపొందించిన రాజీనామాలను పరిశీలించిన సుమిత్రా మహాజన్‌.. నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలకు సూచించారు. అందుకు సున్నితంగా తిరస్కరించిన ఎంపీలు.. రాజీనామాలను తక్షణమే ఆమోదించాలని స్పీకర్‌ను కోరారు. ఎంపీ పదవులకు రాజీనామాలు చేసిన అనంతరం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో వైఎస్సార్‌ సీపీ ఎంపీలు ఆమరణ దీక్ష చేసిన విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top