ఇద్దరి మధ్య ఉత్కంఠ పోరు | Tough Battle In Patna Sahib Between BJP And Congress | Sakshi
Sakshi News home page

ఇద్దరి మధ్య ఉత్కంఠ పోరు

Apr 1 2019 10:12 AM | Updated on Apr 1 2019 10:17 AM

Tough Battle In Patna Sahib Between BJP And Congress - Sakshi

పట్నా: ఇద్దరు రాజకీయ ఉద్దండులు పోటీపడుతుండడంతో బిహార్‌లోని పట్నా సాహీబ్‌ లోక్‌సభ నియోజకవర్గం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సిట్టింగ్‌ ఎంపీ శత్రుఘ్నసిన్హా ఇటీవల బీజేపీని వీడి.. ఈసారి కాంగ్రెస్‌లో చేరి మరోసారి అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను బీజేపీ పోటీలో నిలిపింది. స్థానికంగా ఇద్దరూ బలమైన నేతలు కావడంతో పోటీ తీవ్రంగా ఉంది. అధికార పార్టీలోనే ఉంటూ.. ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సిన్హాను ఓడించాలనే వ్యూహంతోనే బీజేపీ అధిష్టానం రవిశంకర్‌ ప్రసాద్‌ను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.

మరోవైపు తనకు టికెట్‌​ నిరాకరించిన బీజేపీని పట్నా సాహీబ్‌లో ఎలానైనా ఓడించి తీరుతానని షాట్‌గన్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇద్దరూ కూడా బిహార్‌లో స్థానికంగా బలమైన కాయస్థా వర్గానికి చెందిన నేతలే. ఈనియోజకవర్గంలో 48శాతం అగ్రవర్గాలకు చెందిన ఓట్లు కీలకం కానునున్నాయి. గత ఎన్నికల్లో వాటిలో 23శాతం ఓట్లు బీజేపీకే పడ్డాయి. ఈసారి  జేడీయూ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పలు సర్వేలు వెల్లడించాయి. అయితే దళిత, మైనార్టీ, బీసీ ఓట్లపై కాంగ్రెస్‌ ధీమాతో ఉంది. పట్నా సాహిబ్‌ నియోజకవర్గం నుంచి తన ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి రవిశంకర్‌ ప్రసాద్‌పై స్పందిస్తూ ‘రవి శంకర్‌కు నా శుభాకాంక్షలు. గెలుపును పట్నా ప్రజలే నిర్ణయిస్తారు.  ఆ దేవుడి దయ, ప్రజల మద్దతుతో గెలుస్తాననే నమ్మకం నాకుంది’ అని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement