
సాక్షి, భువనేశ్వర్: ఒడిశా అసెంబ్లీలో కాంగ్రెస్,బీజేపీ శాసనసభ్యుల మధ్య మహాత్మా గాంధీ, నాథూరాం గాడ్సే విషయంలో మాటల యుద్ధం సాగింది. శనివారం శాసనసభలో చర్చలో భాగంగా కాంగ్రెస్ పక్షనేత నరసింహా మిత్ర మాట్లాడుతూ.. బీజేపీ సిద్ధాంతాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. జాతిపిత మహాత్మా గాంధీని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, గాంధీని హత్య చేసిన గాడ్సేను ఆర్ఎస్ఎస్ సభ్యులు గౌరవిస్తున్నారని మండిపడ్డారు. దేశ సమగ్రతపై ఆర్ఎస్ఎస్కు గౌరవం ఉంటే నాగపూర్లోని ఆ సంస్థ కేంద్ర కార్యాలయంపై జాతీయ జెండాను ఎందుకు ఎగరవేయడంలేదని ప్రశ్నించారు.
ఆయన వ్యాఖ్యలపై స్పందించి బీజేపీ పక్షనేత ప్రధిపాట్ కుమార్ నాయక్ ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్కు అసలు దేశ భక్తి లేనేలేదని విమర్శించారు. వందేమాతరం అనడానికి ఆసక్తి చూపరని, రాజ్యాంగంపై కనీసం గౌరవం కూడా వారికి లేదని ధ్వజమెత్తారు. ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై జాతీయ జెండా లేనంతమాత్రనా దేశ భక్తిలేదని అర్థంకాదని వివరించారు. జాతీయ పతాకాన్నితాము తల్లితో సమానంగా భావిస్తామన్నారు. ఇద్దరి వ్యాఖ్యలతో అసెంబ్లీ దద్దరిల్లింది. కాసేపటి తరువాత సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది.