
‘మేం కిడ్నాప్ కాలేదు.. స్విచ్చాఫ్ చేస్కున్నాం’
తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, పార్టీకి, శశికళకు పన్నీర్ సెల్వం ఎదురు తిరిగిన నేపథ్యంలో తామంతా ప్రస్తుతం రిసార్ట్ వద్దే విశ్రాంతి తీసుకుంటున్నామని శశికళకు మద్దతిస్తూ కొంతమంది ఎమ్మెల్యేలు చెప్పారు.
చెన్నై: గత రెండు రోజులుగా రిసార్ట్లకే పరిమితమైన దాదాపు 120మంది ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగానే అక్కడ ఉన్నారా? లేక శశికళే వారిని బలవంతంగా బయటకు రానివ్వకుండా అక్కడ ఉంచి భారీ భద్రత నడుమ మధ్య పెట్టేసిందా అంటూ వస్తున్న అనుమానాలను కొంతమంది ఎమ్మెల్యేలు పటాపంచలు చేశారు. తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, పార్టీకి, శశికళకు పన్నీర్ సెల్వం ఎదురు తిరిగిన నేపథ్యంలో తామంతా ప్రస్తుతం రిసార్ట్ వద్దే విశ్రాంతి తీసుకుంటున్నామని చెప్పారు. ఎన్ మురుగుమారన్, ఎం గీత, జయంతి పద్మనాభన్, మరో ఐదుగురు ఎమ్మెల్యేలు గోల్డెన్ బే బీచ్ రిసార్ట్ కు రెండు కిలోమీటర్ల దూరంలో మీడియా ప్రతినిధులను కలిసి తమనెవరూ కిడ్నాప్ చేయలేదని స్పష్టం చేశారు.
శశికళకు తమ మద్దతు, సానూభూతి తెలిపే ఉద్దేశంతోనే స్వచ్ఛందంగా రిసార్టులకు వచ్చామని, బలవంతంగా రాలేదని తెలిపారు. తామందరి అభీష్టం మేరకే చిన్నమ్మ(శశికళ) శాసనసభాపక్ష నేతగా, అంతకు ముందు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నామని, అలా ఎన్నుకున్నవారిలో పన్నీర్ సెల్వం కూడా ఉన్నారని, ఇప్పుడు ఆయన కావాలనే ఎదురుతిరిగారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని చిన్నమ్మే ఏర్పాటుచేస్తుందని, తాము ఆమెకే మద్దతు ఇస్తామని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులంతా తమకు ఫోన్లు చేసి బెదిరిస్తుంటే తట్టుకోలేక తామే స్విచ్ఛాప్ చేసినట్లు వివరించారు. అంతకంటే తమ ముందు మరో అవకాశం లేదని అన్నారు.